అరెస్టైన వైద్యురాలు భారత్‌లో జైషే మహిళా అధిపతి

అరెస్టైన వైద్యురాలు భారత్‌లో జైషే మహిళా అధిపతి

* ఢిల్లీ పేలుడు దర్యాప్తు ఎన్ఐఏ కు అప్పగింత

పలు సంఘటనల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న పలువురు వైద్యులను పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో జరిగిన భారీ పేలుడు పదార్థాల అక్రమ రవాణా కేసులో లక్నోకు చెందిన ఓ మహిళా వైద్యురాలు సాహీనా షాహిద్‌ కూడా ఉన్నారు.  ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్‌లో మహిళా విభాగం ఏర్పాటు, నియామకాల్లో డాక్టర్ షహీనా కీలక పాత్ర పోషించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఆ వైద్యురాలికి పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్‌  ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జైషే సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్‌ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. మసూద్‌ అజార్‌ సోదరి సాదియా అజార్‌ మహిళా గ్రూపుకు నేతృత్వం వహిస్తున్నారు. ‘జమాతుల్‌-ముమినాత్‌’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారుచేస్తున్నది. భారత్‌లో జైషే మహిళా విభాగం బాధ్యతలను డాక్టర్ సాహీనా షాహిద్‌కు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

దర్యాప్తు బృందాలు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాహీనా లక్నోలోని లాల్‌ బాగ్‌ నివాసి. ఫరీదాబాద్‌లో జైషే ఉగ్రవాద మాడ్యూల్‌ను చేధించిన తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె కారు నుంచి ఓ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, జమ్ము కశ్మీర్‌లో పోలీసు బృందాలు వైట్‌ కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ ను చేధించిన విషయం తెలిసిందే.

ఈ కేసులో అరెస్టైన ముజమ్మీల్‌ గనీతో సాహీనాకు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు పోలీసు వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది. అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తోన్న షహీనాకు.. కశ్మీర్‌ డాక్టర్ ముజామిల్‌ గనాయ్‌ అలియాస్‌ ముసైబ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. ఫరీదాబాద్‌లో అతడు అద్దెకు తీసుకున్న రెండు గదుల నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు లభ్యం కావడం ముజామిల్‌ను అరెస్ట్ చేశారు.

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో కోయిల్‌కు చెందిన ముజామిల్ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. శ్రీనగర్‌లో సైనికులను హెచ్చరిస్తూ జైషే మహమ్మద్‌‌కు మద్దతుగా పోస్టర్లు అతికించిన కేసులో జమ్మూ కశ్మీర్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయడంలో ఉగ్రకుట్ర వెలుగులోకి వచ్చింది.  రైఫిల్, పిస్టల్, పేలుడు పదార్థాలను దాచిపెట్టిన కారును షహీనాదిగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. విచారణలో అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా అమ్మోనియం నైట్రేట్‌గా భావిస్తోన్న 350 కిలోల పేలుడు సామాగ్రి, 20 టైమర్లు, ఇతరు అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, సోమవారం సాయంత్రం 12 మంది మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడిన ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారికంగా చేపట్టింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది, అమ్మోనియం నైట్రేట్, ఇంధన నూనె మరియు డిటోనేటర్లను ఉపయోగించినట్లు ప్రాథమిక ఫోరెన్సిక్ నివేదికలు సూచిస్తున్నాయి.
 
కేసును ఎన్ఐఏకి అప్పగించిన తర్వాత, దాని బృందం వెంటనే ఎర్రకోట సమీపంలోని ప్రదేశానికి చేరుకుని సమగ్ర శోధన ఆపరేషన్‌ను ప్రారంభించింది. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించింది, ఆధారాలను సేకరించింది. అనుమానితుల కదలికలను గుర్తించడానికి, పేలుడు పూర్తి పరిస్థితులను నిర్ధారించడానికి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంది.