ఢిల్లీ నగరాన్ని కప్పేసిన పొగమంచు

ఢిల్లీ నగరాన్ని కప్పేసిన పొగమంచు
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 400పైనే నమోదవుతోంది. దీంతో నగరం మొత్తం రెడ్‌జోన్‌లోకి వెళ్లిపోయింది. సోమవారం కూడా వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలోనే కొనసాగుతోంది. గాలి నాణ్యత ఈ సీజన్‌లో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. 
 
నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే గణనీయంగా పడిపోయాయి. సెంట్రల్ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకారం సోమవారం ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 354గా నమోదైంది. దీన్ని చాలా పూర్‌ కేటగిరీగా పేర్కొంటారు. కొన్ని ఎయిర్‌ మానిటరింగ్‌ స్టేషన్లలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది.

ఆనంద్‌ విహార్‌లో ఏక్యూఐ 379గా నమోదైంది. ఐటీవో ప్రాంతంలో 376, ఛాందినీ చౌక్‌ ప్రాంతంలో 360, ఓఖ్లా ఫేజ్‌-2లో 348, జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వద్ద 316, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (టెర్మినల్‌-3) వద్ద 305, నోయిడా సెక్టార్‌ 62వద్ద 342, సెక్టార్‌-1లో 325, సెక్టార్‌ 116 ప్రాంతంలో 339, గురుగ్రామ్‌ సెక్టార్‌ 51 వద్ద 327గా ఏక్యూఐ లెవెల్స్‌ నమోదయ్యాయి.ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు దిగజారుతుండటంతో రాజధాని వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియా గేట్‌ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఆప్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలతోపాటు ఢిల్లీ వాసులు ఇండియా గేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జీవించే హక్కు తమకు ఉన్నదని నినాదాలు చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఇండియా గేట్‌ వద్ద ఎలాంటి నిరసనలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. కేవలం జంతర్ మంతర్ వద్ద మాత్రమే నిరసనలు చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల చర్యపై ఢిల్లీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.