భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బెట్టింగ్ యాప్ కేసులో జప్తు చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సైట్ వన్ ఎక్స్బెట్ కు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ధావన్కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తిని, రూ.6.64 కోట్ల విలువైన రైనా మ్యూచువల్ ఫండ్స్ను జప్తు చేసేందుకు ఈడీ తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. దర్యాప్తు సమయంలో వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన పలు కేసులను ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున మనీలాండరింగ్కు దోహదపడుతాయని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తున్నది.
ఈ యాప్లో లక్షలాది మంది వ్యక్తులు, పెట్టుబడిదారులను రూ.కోట్లు మోసం చేశాయని, పెద్ద మొత్తంలో పన్ను ఎగవేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. బెట్టింగ్స్ యాప్స్కు మద్దతుగా పలువురు ప్రముఖ సినీతారలు, క్రికెటర్లు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా రంగంలోకి విచారణ జరుపుతున్నది. ఇందులో భాగంగా పలువురు సినీ తారలు, మాజీ క్రికెటర్ల పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
ఇప్పటికే పలువురు నటీనటులు, క్రికెటర్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది. 1xBet, దాని ప్రతినిధులను బెట్టింగ్ను ప్రోత్సహించేలా ఇద్దరు మాజీ క్రికెటర్లతో ఎండార్స్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరితో పాటు ఇదే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో గతంలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటీనటులు సోనుసూద్, ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి, అంకుష్ హజ్రాతో పాటు పలువురిని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

More Stories
అజిత్ పవర్ కుమారుడి `భూమి కుంభకోణం’పై దర్యాప్తు!
మహిళలకు నగదు బదిలీలతో రాష్ట్రాల ఖజానాలుఖాళీ!
మల్టీప్లెక్స్ టికెట్ ధరలపై సుప్రీంకోర్టు ఆందోళన