మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జోక్యం చేసుకోలేం

మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జోక్యం చేసుకోలేం
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అది చట్టవిరుద్దం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టత ఇచ్చింది. థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలని పిటిషనర్ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. 

మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ ఇచ్చిన జీవో 590ని సవాలు చేస్తూ తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కొర్రా వసుంధర హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున హైకోర్టులో సీనియర్ న్యాయవాది శ్రీరాం, మరో న్యాయవాది అశోక్ రాం వాదనలు వినిపించారు. టెండర్లు ఖరారు చేయకుండా స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. 

అయితే ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు తెలిపింది. కాబట్టి థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.  కాకపోతే ఆస్పత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని తీసుకున్న నిర్ణయంలో ఉన్న లాభ, నష్టాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.