బిజెపి పాలనలోనే ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలంటూదుష్ప్రచారం!

బిజెపి పాలనలోనే ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలంటూదుష్ప్రచారం!
సిద్ధ‌రామ‌య్య నేతృత్వంలోని కాంగ్రెస్ స‌ర్కారు క‌ర్నాట‌క‌లో ఆర్ఎస్ఎస్ కార్య‌క‌లాపాల‌పై ఆంక్షలు విధిస్తు ఉత్త‌ర్వులు జారీ చేయడంతో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉండడంతో ఆత్మరక్షణలో పడిన ముఖ్యమంత్రి త‌మ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వులు కొత్త‌వేమీ కాద‌ని, గ‌త బీజేపీ ప్ర‌భుత్వం ఆమోదించింద‌ని అంటూ దుష్ప్రచారంకు దిగారు. 
 
అయితే, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌దీశ్ శెట్ట‌ర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వ వాద‌న‌ల‌ను తోసిపుచ్చారు. తన ప్రభుత్వ హయాంలో అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్ప‌ష్టం చేశారు. ఏదైనా ప్రైవేట్ సంస్థ, సంఘం, వ్యక్తుల సమూహం తమ కార్యకలాపాల కోసం ప్రభుత్వ ఆస్తిని, ప్రాంగణాలను ఉపయోగించుకోవడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. 
 
సిద్దరామయ్య ప్రభుత్వ ఉత్తర్వులో ఆర్‌ఎస్‌ఎస్ పేరు స్పష్టంగా చెప్పనప్పటికీ, ఆ ఉత్తర్వులోని నిబంధనలు దాని రూట్ మార్చ్‌లతో సహా సంఘ్ కార్యకలాపాలను ప్రభావితం చేయడానికి ఉద్దేశించినవేన‌ని పేర్కొంటున్నారు.  తన ఉత్తర్వును సమర్థించుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం శెట్టర్ నేతృత్వంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన 2013 సర్క్యులర్‌ను ఉదాహార‌ణ‌గా చూపిస్తున్న‌ది. 
 
పాఠశాల ఆవ‌ర‌ణ‌లు, అనుబంధ ఆట స్థలాలను విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. సంఘ్‌ను లక్ష్యంగా చేసుకున్నారనే ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ, తాము గత బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని మాత్రమే చెబుతున్న‌ది. 
 
అయితే, హుబ్లీలో షెట్ట‌ర్ మీడియాతో మాట్లాడుతూ జగదీష్ షెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని తాము (ప్రభుత్వం) కొనసాగిస్తున్నామని ఇప్పుడు చెబుతున్నార‌ని, ఇది అస‌లు ఆ ఉద్దేశం కాద‌ని స్పష్టం చేశారు. ఒక సంస్థ తన కార్యకలాపాలకు పాఠశాల ప్రాంగణాన్ని ఉపయోగించడానికి అనుమతి కోరినప్పుడు విద్యా శాఖ అనుమతి నిరాకరిస్తూ ఒక ప్రత్యేక సందర్భంలో మాత్రమే సర్క్యులర్ జారీ చేసిందని తెలిపారు.
 
కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఆయన ఇది తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం కాద‌ని, ఇది మొత్తం రాష్ట్రానికి సాధారణ సర్క్యులర్ కూడా కాద‌ని తేల్చి చెప్పారు. దానిలో ఆర్‌ఎస్‌ఎస్ గురించి ఎలాంటి ప్ర‌స్తావ‌న లేద‌ని స్పష్టం చేశారు. ఆర్ధిక, శాంతిభద్రతలలో పూర్తిగా విఫలమైన సిద్దరామయ్య ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆర్ఎస్ఎస్ పై అనవసరపు వివాదం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.