దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దీపావళి శుభాకాంక్షలు

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము అందరికి ఆనందం, శాంతి, శ్రేయస్సు నిండిన దీపావళలి కావాలని ఆకాంక్షించారు. ఈ వేలుగుల పండుగ మన జీవితాల్లో సామరస్యం, ఆనందం, శ్రేయస్సును తీసుకురావాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

“దీపావళి భారతదేశం ప్రధాన, ప్రసిద్ధ పండుగ. ఇది చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజున ప్రజలు తమ ఇండ్లల్లో లక్ష్మీ దేవిని పూజించి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ ఆత్మపరిశీలన, స్వీయ-అభివృద్ధికి కూడా ఒక అవకాశం” అని రాష్ట్రపతి తెలిపారు. 

 
“దీపావళి రోజున ఒక దీపం నుంచి ఎన్ని దీపాలు వెలిగిస్తామో, అదే విధంగా సమాజంలోని పేద, నిరుపేద ప్రజలకు సహాయం చేసి వారి జీవితాల్లో ఆనందాన్ని పొందవచ్చు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఈ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలను, శాంతిని, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. “ఈ దీపాల పండుగ మన జీవితాల్లో సామరస్యం, ఆనందం, శ్రేయస్సును ప్రకాశింప చేస్తుంది. సానుకూలత ఆత్మ మన చుట్టూ ప్రబలంగా ఉంటుంది” అంటూ ట్వీట్‌ చేశారు. కాగా, దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగిపోయిన వేళ, సరిహద్దుల వద్ద మాతృభూమి రక్షణలో ఉన్న భద్రతా బలగాలు కూడా పండుగను ఉత్సాహంగా జరుపుకున్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ నుంచి పంజాబ్‌ అట్టారి వరకు, జమ్మూకశ్మీర్‌ నుంచి హరియాణా వరకు, సరిహద్దు ప్రాంతాలు దీపాల కాంతులతో మెరిశాయి.

జైసల్మేర్‌లో భారత్‌- పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్‌ జవాన్లు దీపావళిని కుటుంబసభ్యుల్లా జరుపుకున్నారు. కమాండెంట్‌ ముకేష్‌ పాంవార్‌ మాట్లాడుతూ “మేం దేశ రక్షకులమే కాకుండా ఒక కుటుంబం కూడా. ఇక్కడే మనందరం కలసి దీపావళి జరుపుకుంటున్నాం” అని చెప్పారు. జవాన్లు సరిహద్దు వెంబడి రంగోళీలు వేసి, మట్టి దీపాలను వెలిగించి, బాణాసంచా పేల్చారు. ప్రధాన కార్యాలయం నుంచి పండగ సందర్భంగా బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం నుంచి మిఠాయిలు, టపాసులు వచ్చాయని అధికారులు తెలిపారు. =