విశాఖ స్టేడియంలోని స్టాండ్‌ కు, గేట్‌ కు మహిళా క్రికెటర్ల పేర్లు

విశాఖ స్టేడియంలోని స్టాండ్‌ కు, గేట్‌ కు మహిళా క్రికెటర్ల పేర్లు
ఈ నెల 12 న విశాఖపట్నం వేదికగా జరగనున్న ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ లో మహిళా క్రికెటర్లు దిగ్గజాలు మిథాలీ రాజ్‌, రావి కల్పనలకు అరుదైన గౌరవం లభించనుంది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.  అక్టోబర్‌ 12న విశాఖపట్నంలోని వీడీసీఏ స్టేడియంలో జరగబోయే భారత్‌-ఆస్ట్రేలియా మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌ సందర్భంగా మహిళా క్రికెట్‌ దిగ్గజాలు మిథాలీ రాజ్‌, రావి కల్పన ఘన సత్కారం అందుకోబోతున్నారు.
ఈ సందర్భంగా స్టేడియంలోని ఒక స్టాండుకు మిథాలీ రాజ్‌ పేరు, ఒక గేటుకు రావి కల్పన పేరు పెట్టనునట్టు ఏసీఏ ప్రకటించింది.  మహిళల క్రికెట్‌ అభివృద్ధికి వారు చేసిన కఅషి, సాధించిన విజయాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఈ చొరవను అభినందిస్తూ మహిళా క్రికెటర్లకు లభిస్తున్న ఈ గుర్తింపు రాష్ట్రం క్రీడల్లో సమ్మిళితత్వం, ప్రతిభకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
 
క్రీడా రంగంలో సదుపాయాలు, శిక్షణ మార్గాలు, గుర్తింపు అవకాశాలను పెంపొందించడంలో నారా లోకేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ కూడా ఈ దిశగా శక్తివంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారని సంస్థ పేర్కొంది. ఏసీఏ తీసుకున్న ఈ నిర్ణయం, భారత మహిళా క్రికెట్కు మిథాలీ రాజ్‌, రావి కల్పన అందించిన సేవలను మాత్రమే కాకుండా, రాబోయే తరాల యువ క్రీడాకారిణులకు పెద్ద కలలు కనాలని ప్రేరేపించే ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది.