తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా

తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా
* వడ్డీ రేట్లు మరోసారి యథాతథం

2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతం లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నివేదిక అంచనా వేసింది. జీఎస్టీ హేతుబద్దీకరణతో అక్టోబర్‌లో అది మరింత తక్కువ ఉండే అవకాశముందని పేర్కొంది.  దాంతో కీలక వడ్డీరేట్లను (రెపోరేట్‌) మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించేందుకు హేతుబద్ధత ఉందని తెలిపింది. కానీ అంచనాలకు భిన్నంగా ఈసారి రేట్‌ను యథాతథంగా కొనసాగించింది.

అలాగే మోదీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందిస్తూ ఇది దేశ ఆర్థిక వృద్ధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావాన్ని కొంతమేర భర్తీ చేస్తుందని తెలిపారు.  ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో సుంకాలకు సంబంధించిన పరిణామాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 నుంచి 6.8 శాతానికి ఆర్బీఐ సవరించిందని చెప్పారు.

దీంతో అనుకూల పరిస్థితులు, తక్కువ ద్రవ్యోల్బణం, ద్రవ్య సడలింపుల ద్వారా ఆర్థిక వృద్ధి అంచనా స్థిరంగా ఉందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్లు పేర్కొన్నారు.  మోదీ ప్రభుత్వం ప్రకటించిన వృద్ధిని ప్రేరేపించే విధాన సంస్కరణలు అమెరికా సుంకాల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి సహకరిస్తాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 

సాఫ్ట్‌వేర్‌, సేవల ఎగుమతి బలంగా ఉందని చెప్పారు. దేశంలోని 700.2 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 11 నెలల దిగుమతులను సరిచేయడానికి సరిపోతాయని పేర్కొన్నారు.  కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 5.5 శాతం రెపో రేటు కొనసాగుతుందని  ప్రకటించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రిజర్వుబ్యాంక్‌ మూడు విడతలుగా వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి, ఏప్రిల్‌ సమీక్షల్లో 0.25 శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్బీఐ జూన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది.  మూడు వరుస సమీక్షల్లో కలిపి ఒక్క శాతం లేదా 100 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. ఇప్పుడు మరోసారి యథాతథంగా ఉంచింది. 
కాగా, తర్వాత జరిగే అంటే డిసెంబర్‌ సమీక్షలో మాత్రం రెపోరేటు పావు శాతం తగ్గి 5.25 శాతానికి దించవచ్చని మార్కెగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు.  మరోవైపు చిన్న మొత్తాలపై వడ్డీరేటును మరోసారి యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్‌ 1 నుంచి మూడు నెలల పాటు ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లు కొనసాగనున్నాయని తెలిపింది. దీంతో చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను ముట్టుకోకపోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు) చిన్న మొత్తాలపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. దీంతో సుకన్య సమృద్ధి పథకం కింద వడ్డీరేటు 8.2 శాతంగాను, అలాగే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌)పై 7.1 శాతం, పోస్టాఫీస్‌ పొదుపు డిపాజిట్‌ స్కీంపై 4 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తున్నది.