సోనమ్‌ వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు

సోనమ్‌ వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు

లద్దాఖ్‌ లో హింసను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో వాతావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ను పోలీసులు జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేసి జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆయన అరెస్ట్‌ నేపథ్యంలో తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వాంగ్‌చుక్‌కు దాయాది దేశం పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. 

అంతేకాదు పాక్‌తోపాటూ మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను కూడా ఆయన సందర్శించినట్లు లద్దాఖ్‌ డీజీపీ ఎస్‌డీ సింగ్‌ జామ్వాల్‌ తెలిపారు. లెహ్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ పాక్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారి ఒకరితో వాంగ్‌చుక్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. వాంగ్‌చుక్‌తో  సంబంధం ఉన్న పాక్ గూఢచారి (పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్- పీఐఓ)ని అరెస్టు చేసినట్లు డీజీపీ చెప్పారు.

ఆ పీఐఓ నేరుగా పాక్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.  అంతేకాదు పాక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వాంగ్‌చుక్‌ హాజరైనట్లు కూడా తేలిందని చెప్పారు.  అతను బంగ్లాదేశ్‌ను కూడా సందర్శించినట్లు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని డీజీపీ వెల్లడించారు.

సోనమ్‌ వాంగ్‌చుక్‌కు రెచ్చగొట్టే చరిత్ర ఉందని, ఎఫ్‌సీఆర్‌ఏ నిధుల ఉల్లంఘనకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వాంగ్‌చుక్‌పై ఉన్న అభియోగాలు గురించి డీజీపీ మాట్లాడుతూ, “వాంగ్‌చుక్‌ సెప్టెంబర్ 24న లేహ్లో హింసను ప్రేరేపించారు. ఆయనకు ప్రజలకు రెచ్చగొట్టే చరిత్ర ఉంది. అతను అరబ్, నేపాల్, బంగ్లాదేశ్ల గురించి మాట్లాడుతూ నిరసనకారులను రెచ్చగొట్టాడు” అని చెప్పారు.

“కేంద్రంతో లద్ధాఖ్ ప్రతినిధులు చర్చలు జరగకుండా వాంగ్‌చుక్‌ అడ్డుకున్నారు. ఇందులో కొంత మంది పర్యావరణ కార్యకర్తలమని చెప్పుకునే వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది. ఇది వారి విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. అంతేకాదు వాంగ్చుక్పై విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై ఎఫ్సీఆర్ఏ కేసు నమోదైంది. దీనిపైనా దర్యాప్తు జరుగుతోంది” అని డీజీపీ జామ్వాల్ వెల్లడించారు.

లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ వాంగ్‌చుక్‌ నాయకత్వంలో నిరాహార దీక్ష చేస్తున్న 15 మందిలో ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని సెప్టెంబర్‌ 10న దవాఖానకు తరలించిన దరిమిలా ఎల్‌ఏబీ యువజన విభాగం బంద్‌కి పిలుపు ఇచ్చింది. మంగళవారం తన 15 రోజుల దీక్షను విరమించిన వాంగ్‌చుక్‌ హింసకు పాల్పడవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

అయితే ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత లెహ్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు దాని ఎదుట నిలిపి ఉన్న భద్రతా సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేశారు. ఈ అల్లర్లకు వాంగ్‌చుక్‌కే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.