విద్యుత్తు ఏడీఈ అక్రమార్జన రూ. 200 కోట్లు… ఎసిబి అరెస్ట్

విద్యుత్తు ఏడీఈ అక్రమార్జన రూ. 200 కోట్లు… ఎసిబి అరెస్ట్

విద్యుత్తు శాఖలో విధులు నిర్వర్తిస్తూ అక్రమ సంపాదనలో వందల కోట్లకు పడగలెత్తిన ఇబ్రహీంబాగ్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ (ఏడీఈ) ఇరుగు అంబేద్కర్‌ను ఏసీబీ అరెస్టు చేసింది.  . అనంతరం ఆయన్ని ఏసీబీ కోర్టులో హాజరుపరగా అంబేద్కర్‌కు 14 రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని చంచల్‌గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు. 

అతని ఇండ్లు, కుటుంబసభ్యులు, స్నేహితులు, బినామీలకు చెందిన 11 ప్రాంతాల్లో ఏకకాలంలో మంగళవారం ఉదయం సోదాలు చేపట్టి భారీగా నగదు, నగలు, స్థిర, చరాస్తుల పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకున్నది.  ఈ సోదాల్లో శేరిలింగంపల్లిలో ఒక ప్లాట్‌, గచ్చిబౌలిలోని జీ+5 బిల్డింగ్‌, సూర్యాపేట జిల్లాలోని అమ్తార్‌ కెమికల్స్‌కు చెందిన 10 ఎకరాల భూమి, హైదరాబాద్‌లోని 6 రెసిడెన్షియల్‌ ప్రైమ్‌ ఓపెన్‌ ప్లాట్లు, వ్యవసాయ భూమి, రెండు కార్లు, భారీగా బంగారు, వెండి ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను అధికారులు చేసుకున్నారు. 

అంబేద్కర్‌కు చెందిన ఓ బినామీ ఇంట్లో ఏసీబీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూ.2.18 కోట్ల లిక్వి డ్‌ క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్‌ సహా.. హైదరాబాద్‌ నగరంలో ని గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలో స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. 

దీంతోపాటు బ్యాంకు బ్యాలెన్స్‌ రూ.78 లక్షలు, షేర్లలో మరో రూ.36 లక్షల పెట్టుబడులు ఉన్న ట్టు గుర్తించింది. కారులో మరో రూ.5.5 లక్షల నగదు దొరికిందని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ తెలిపారు. భార్య సునందతో కలిసి అంబేద్కర్‌ 2023 ఏప్రిల్‌ 23న అంతర్‌ కెమికల్స్‌ కంపెనీని రూ.3కోట్ల పెట్టుబడితో టీఎన్‌జీవో కాలనీలోని తన ఇంట్లో ప్రారంభించారు. ఆయన విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్నప్పటికీ అంతర్‌ కెమికల్స్‌లో డైరెక్టర్‌గా ఆర్‌వోసీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు. కంపెనీ నిర్వహణ బాధ్యతలను గుర్రం రామకృష్ణకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంబేద్కర్‌ తన అక్రమ ఆదాయంలో చాలా వరకు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.