బీఆర్ఎస్‌కు ఇంకెన్నాళ్లు దోచిపెడ‌తారు?

బీఆర్ఎస్‌కు ఇంకెన్నాళ్లు దోచిపెడ‌తారు?
ఇర‌వై ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారులంతా బీఆర్ఎస్కు దోచిపెడుతూనే ఉన్నార‌ని పేర్కొంటూ ఇంకెన్నాళ్లు దోచిపెడ‌తార‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు చూస్తుండగా తనను కలిసిన గ్రానైట్ వ్యాపారులను కేంద్రమంత్రి నిలదీశారు.  ఒక్కో గ్రానైట్ కటింగ్ మిషన్ దుకాణం నుండి సభ్యత్వం పేరుతో గ్రానైట్ అసోసియేషన్ రూ.10 లక్షల నుండి రూ.50 లక్షలదాకా వసూలు చేసిందని, ఆ సొమ్మును ఏం చేశారో చెప్పాలని పేర్కొంటూ ఆ లెక్కలన్నీ త్వరలోనే బయటకు తీస్తా అని స్పష్టం చేశారు. 
 
ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లాచ్చాక వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని చెబుతూ గ్రానైట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని గ్రానైట్ అసోసియేషన్ నేతలు చెప్పగా మరి కనీసం ప్రెస్ మీట్ పెట్టి మోదీకి ధన్యవాదాలు అయినా చెప్పారా? అని నిలదీశారు. గత 20 ఏళ్లుగా మీరంతా బీఆర్ఎస్ కు దోచిపెడుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు.  “మీలో కొందరు వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులై వ్యాపారాలను పెంచుకుంటున్నారు. వచ్చిన సొమ్ముతో రాజకీయాలు చేస్తున్నారు” అంటూ సంజయ్ చెప్పారు.
గ్రానైట్ అసోసియేషన్ నుండి బండి సంజయ్ కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడంటూ జరిగిన దుష్ప్రచారాన్ని ఎందుకు ఖండించ‌లేద‌ని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు.  “ఏనాడైనా మీరు నాకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? నేను గెలిచిన తరువాత కూడా మీలో ఒక్కరైనా నా దగ్గరకు వచ్చి కనీసం బొకే అయినా ఇచ్చారా? ఒక్క స్వీటు ముక్క కూడా తిన్పించలేదు కదా, కానీ బయట మాత్రం కొందరు త‌న‌కు రూ. 700 కోట్లు ఇచ్చానని నిందలేస్తుంటే మీ అసోసియేషన్ కనీసం ఖండించలేదే?” అంటూ సంజయ్ మండిప‌డ్డారు. 
 
పైగా వందల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు దోచి పెట్టి ఆ పార్టీని ఇంకా సాదుతున్నార‌ని ఆయన అడిగారు. గ్రానైట్ అసోసియేషన్ కేంద్రానికి చెల్లించింది రూ. 300 కోట్లకు మించి లేద‌ని, బయటకు పోయి మాత్రం వెయ్యి కోట్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారిన బండి సంజ‌య్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపడుతూ ఎన్నాళ్లు వ్యాపారం చేస్తారని, స్వేచ్చగా వ్యాపారం చేసే పరిస్థితిని తాను కల్పిస్తానని హితవు చెప్పారు. 
 
గ్రానైట్ కటింగ్ మిషన్ దుకాణాల నుండి సభ్యత్వం పేరుతో ఒక్కో దుకాణం నుండి రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల దాకా గ్రానైట్ అసోసియేషన్ వసూలు చేసింద‌ని, దాదాపు 350 నుండి 500 షాపుల దాకా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉంద‌ని చెబుతూ మరి ఆ సొమ్మును ఏం చేశారు? అని నిలదీశారు. దీంతో కంగుతిన్న‌ గ్రానైట్ అసొసియేషన్ నాయకులు సమాజానికి సేవ చేస్తామని అందులో భాగంగానే గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లను ఏర్పాటు చేశామని చెప్పారు.