కొత్తగా డిజిటల్‌ చెల్లింపుల్లోకి బిఎస్‌ఎన్‌ఎల్‌

కొత్తగా డిజిటల్‌ చెల్లింపుల్లోకి బిఎస్‌ఎన్‌ఎల్‌
 
ప్రభుత్వ టెల్కో భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) కొత్తగా డిజిటల్‌ చెల్లింపుల్లోకి ప్రవేశించడానికి కసరత్తు చేస్తోంది. వచ్చే దీపావళి కల్లా యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యుపిఐ) సేవలను ప్రారంభించే పనిలో ఉంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ పే పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.  భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ (భీమ్‌) యుపిఐ ఆధారంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ పే సేవలను వినియోగించుకునేలా ఈ యాప్‌ను రూపొందిస్తోంది.
స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఆర్థిక లావేదేవీలు, బిల్లుల చెల్లింపుల కోసం ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటియం లాంటి ప్రయివేటు డిజిటల్‌ యాప్‌లకు ధీటుగా బిఎస్‌ఎన్‌ఎల్‌ పే సేవలను వినియోగంలోకి తేవాలని నిర్దేశించుకుంది.  బిఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్‌ యాప్‌లో భాగంగానే ఇది ఉంటుందని తెలుస్తోంది. భీమ్‌ యుపిఐ ద్వారా దీని సేవలను యూజర్లు వినియోగించుకోవడానికి వీలుంటుంది. ఇతర డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ల మాదిరిగానే బిఎస్‌ఎన్‌ఎల్‌ పే పని చేయనుంది. అన్ని రకాల చెల్లింపులు చేయడానికి వీలుంటుంది. 
 
తమ వినియోగదారులకు నాణ్యమైన డిజిటల్‌ సేవలు అందించడంతో పాటు, దేశంలో వేగంగా విస్తరిస్తున్న యుపిఐ చెల్లింపుల మార్కెట్‌లో తాము రాణించాలని బిఎస్‌ఎన్‌ఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు తమ మొబైల్‌, ల్యాండ్‌లైన్‌, బ్రాడ్‌బాండ్‌ సేవల బిల్లులను సులభంగా చెల్లింపులు చేసేలా ఇందులో అప్షన్స్‌ను ఇవ్వనుందని తెలుస్తోంది.