100 దేశాలకు భారతీయ విద్యుత్ వాహనాలు!

100 దేశాలకు భారతీయ విద్యుత్ వాహనాలు!
గణేశ్ ఉత్సవ్ సందర్భంగా మేక్ ఇన్ ఇండియాలో సరికొత్త అధ్యాయం మొదలైందని చెబుతూ ఇవాళ్టి నుంచి దేశీయంగా రూపొందించిన విద్యుత్ వాహనాలు 100 దేశాలకు ఎగుమతి అవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గుజరాత్‌లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, స్వదేశీ మనకు లైఫ్​ మంత్రమని చెప్పారు. డబ్బులు ఎవరు పెట్టినా సరే పని మాత్రం భారతీయులతోనే జరగడమే స్వదేశీ మంత్రమని పేర్కొన్నారు. 
 
గత దశాబ్ద కాలంలో భారత్​లో ఎలక్ట్రానిక్స్​ ఉత్పత్తి 500 శాతానికి పెరిగిందని మోదీ అభినందించారు. ముఖ్యంగా మొబైల్​ ఉత్పత్తి 2,700శాతం, రక్షణ రంగ ఉత్పత్తులు 200 శాతానికి పెరిగాయని గుర్తు చేశారు. మేకిన్​ ఇండియాకు ఇదో గొప్పరోజని, ఇక్కడ తయారైన వాహనాలు వందలాది దేశాలకు ఎగమతి అవుతున్నాయని తెలిపారు.  “గణేశ్ ఉత్సవ్ సందర్భంగా మేక్ ఇన్ ఇండియాలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇవాళ్టి నుంచి దేశీయంగా రూపొందించిన విద్యుత్ వాహనాలు 100 దేశాలకు ఎగుమతి అవుతాయి” అని తెలిపారు. 

“విద్యుత్‌ వాహనాల్లో బ్యాటరీ తయారీ ముఖ్యమైన అంశమని మనందరికీ తెలుసు. కొన్నేళ్ల క్రితం వరకు బ్యాటరీలను దిగుమతి చేసుకున్నాం. విద్యుత్ వాహనాల తయారీని బలోపేతం చేయడానికి భారత్‌లోని బ్యాటరీలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే 2017లో టీడీఎస్‌జీ బ్యాటరీ యూనిట్‌కు శంకుస్థాపన చేశాం” అని ప్రధాని చెప్పారు. 

“భారత్‌కు ప్రజాస్వామ్య శక్తితో పాటు జనాభా అనుకూలత ఉంది. అధిక సంఖ్యలో నైపుణ్యంతో కూడిన మానవవనరులు అందుబాటులో ఉన్నారు. భారత్‌లో పెట్టుబడి పెడితే భాగసామ్యం అయిన ప్రతిఒక్కరికీ లాభదాయకమే” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యావత్ ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్​ వైపు చూస్తోందని, ఈ సమయంలో ఏ రాష్ట్రం వెనుకబడి ఉండకూదని ప్రధాని స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రం అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కృషి చేయాలని సూచించారు. 

మన దేశానికి వచ్చే ఇన్వెస్టర్లు ఏ రాష్ట్రానికి వెళ్లాలో అర్థం కాక అయోమయం కావాలని, ఇందుకోసం అభివృద్ధి ఆధారిత, సుపరిపాలన విధానాలను రూపొందించేందుకు అన్ని రాష్ట్రాలు పోటీపడాలని ప్రధాని కోరారు.  “జపాన్​కు చెందిన సుజుకీ సంస్థ భారత్​లో తయారీ చేస్తుంది. ఇక్కడ తయారీ చేసిన కార్లను జపాన్​కు తిరిగి ఎగుమతి చేస్తున్నాం. ఇది కేవలం భారత్​- జపాన్​ మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచానికి భారత్​పై ఉన్న నమ్మకాన్ని ప్రదర్శిస్తోంది. మారుతీ సుజుకీ లాంటి సంస్థలు మేకిన్​ ఇండియాకు ప్రచారకర్తలు. ఇక్కడ రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలు మేడిన్​ ఇండియా అని రాసి అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి” అని ప్రధాని వివరించారు.


అంతకుముందు మారుతి సుజుకీ సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈ-విటారాను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సుజుకీ, తొషిబా, దెన్షో సంస్థలు సంయుక్తంగా నిర్మించిన లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం హన్‌సల్‌పుర్‌లో ఉన్న మారుతి సుజుకీ కార్ల తయారీ యూనిట్‌లో మోదీ కలియతిరిగారు. ఈ-విటారాకు సంబంధించిన విశేషాలతో పాటు ప్లాంట్‌లో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికతను కంపెనీ ప్రతినిధులు మోదీకి వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్‌తో పాటు మంత్రులు పాల్గొన్నారు.  దేశీయంగా రూపొందించిన ఈ-విటారాను జపాన్‌ సహా 100కుపైగా దేశాలకు ఎగుమతి చేస్తామని మారుతి సుజుకీ కంపెనీ తెలిపింది. ఐరోపాలో జరిగిన ప్రదర్శనలో మారుతి సుజుకీ సంస్థ తొలిసారి ఈ-విటారాను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ-విటారా రెండు బ్యాటరీ వేరియంట్‌లతో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.