హైకోర్టులో కేసీఆర్, హరీష్‌ రావులకు చుక్కెదురు

హైకోర్టులో కేసీఆర్, హరీష్‌ రావులకు చుక్కెదురు
 
కాళేశ్వరం కమిషన్ పై విచారణ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీశ్ రావులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు. దీనిపై  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వీటిపై గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి.
ఈక్రమంలో  కేసీఆర్, హరీష్ రావులు కోరిన మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందని  తెలిపారు. అంతేకాకుండా జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో కంటే ముందే మీడియాకు ఇచ్చి తమ పిటిషనర్ల పరువుకు భంగం కలిగించారని కోర్టుకు న్యాయవాది సుందరం తెలిపారు.
తమకు 8బి, 8సి కింద నోటీసు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తలు జోక్యం చేసుకుని 8బి నోటీస్ కాకుండా సెక్షన్ 5(1) ఎందుకు ఇచ్చారంటూ ప్రభుత్వ తరఫు నాయ్యవాది ఏజీని సూటిగా ప్రశ్నించారు.  తాము ఇచ్చిన నోటీస్ 8బి లాంటి నోటీసని కోర్టుకు ఏజీ తెలిపారు. హరీష్ రావు, కేసీఆర్ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఈ నివేదిక పెట్టిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్న ఏజీ వెల్లడించారు.
ఆ క్రమంలో ఈ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం ఉంటుందని కోర్టుకు ఏజీ వివరించారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టి ఉంటే దానిని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  ఈ రిపోర్ట్ మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ దీనిపై తదుపరి విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది.