సరోగసి మహిళలతో బాండ్లు రాయించుకున్న నిందితురాలు

సరోగసి మహిళలతో బాండ్లు రాయించుకున్న నిందితురాలు
సికింద్రాబాద్‌ సృష్టి ఫెర్టిలిటీ కేసులో సరోగసి మహిళలతో నిందితురాలు బాండ్లు చేయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తనిఖీల్లో భారీగా ప్రామిసరీ నోట్లు, బాండ్లు బయటపడ్డాయి. పెద్ద ఎత్తున హార్మోన్‌ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐవిఎఫ్‌ సెంటర్‌కు వెళ్లిన దంపతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.  నిందితురాలు లక్ష్మి ఏజెంట్ల ద్వారా సేకరిస్తున్నారు. లక్ష్మి నివాసంతో పాటు హెగ్డే ఆస్పత్రి, పలు ఫెర్టిలిటీ సెంటర్ల రిపోర్టులు గుర్తించారు. ఐవిఎఫ్‌ సెంటర్లతో లక్ష్మికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
లక్ష్మి మహిళలను ప్రలోభపెట్టి సరోగసికి ఒప్పిస్తున్నారు. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు మహిళలతో బేరం కుదుర్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు.  సరోగసి కోసం వచ్చిన దంపతుల దగ్గర రూ.25 లక్షల వరకు లక్ష్మి వసూలు చేస్తున్నారు. పిల్లల విక్రయాల కేసులో గతంలో లక్ష్మిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.  8 మంది మహిళలకు ఇప్పటికే పోలీసుల నోటీసులు ఇచ్చారు. నిందితురాలు లక్ష్మి, కుమారుడు నరేందర్‌ పోలీసులు రిమాండ్‌లో ఉన్నారు.

డాక్టర్ విద్యుల్లత పేరుతో అనుమతులు తీసుకుని యూనివర్సల్ సృష్టి పేరుతో ఐవిఎఫ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యుల్లత కలిసి ఐవిఎఫ్ కోసం వచ్చిన దంపతులకు సరోగసికి వెళ్లాలని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేశారు.  కాగా, ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రత నేరాంగీకార పత్రంలో పలు కీలక అంశాలు నమోదు చేశారు. నమ్రత నేరాన్ని అంగీకరించిందని పోలీసులు పేర్కొన్నారు.

నేరాంగీకార పత్రంలోని వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖ, తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఫెర్టిలిటీ సెంటర్లు నడిపారు.  రకరకాలుగా ఏజెంట్లను నియమించుకొని పిల్లలను కొనుగోలు చేశారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు డబ్బుల ఆశచూపి శిశువుల విక్రయానికి అక్రమంగా ఒప్పందం చేసుకున్నారు. ప్రసవం తర్వాత బాలింతల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి వారిని సరోగసి ద్వారా పుట్టిన వారిగా నమ్మించారు. పైగా, పలు పోలీసు స్టేషన్లలో తనపై కేసులు నమోదైనట్లు నమ్రత ఒప్పుకొన్నారు.

సృష్టి ఆస్పత్రి కేసు ఓ దంపతులు ఫిర్యాదు చేయడంతో జూలై 27వ తేదీన బయటపడింది. దీంతో పోలీసులు విచారణ జరిపి డాక్టర్‌ నమ్రత విశాఖలో డాక్టర్‌ కల్యాణి, టెక్నిషియన్ చెన్నారావుతో పాటు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఎనస్తీషియన్ సదానంద్లు అరెస్టు చేశారు.  సరోగసి పద్ధతి ద్వారా పిల్లలు లేని వారికి ప్రయోజనం చేకూరుస్తామని నమ్మబలికి నమ్రత వేరే వారి శిశువులకు కొనుగోలు చేసి బాధితులకు విక్రయించి ప్రస్తుతం జైలు జీవితం గడుపతున్నారు.

ఈ ఘటన తర్వాత విచారణ చేపట్టిన పోలీసులు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌కు సరైన అనుమతులు లేవని వెల్లడించారు.  ఆ హాస్పిటల్ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లకు 2021లోనే గడువు తీరిందని తెలిపారు. సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ వ్యవహారంపై గతంలోనే డీసీపీ రష్మీ పెరుమాళ్  సంతానం కలగని దంపతులను సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత మోసగించిందని తెలిపారు.

సంతానం కలగని దంపతులు సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌కు వెళ్లిన అనంతరం దంపతులకు డాక్టర్‌ నమ్రత పలు టెస్ట్లు నిర్వహించి ఐవీఎఫ్‌ సాధ్యం కాదని సరోగసీ ద్వారా బిడ్డను పొందవచ్చని చెప్పి మోసం చేశారని డీసీపీ పేర్కొన్నారు. సరోగసీ కోసం రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని, విశాఖకు చెందిన ఓ దంపతులను ఒప్పించానని నమ్రత ఓప్పించినట్లు రష్మి పెరుమాళ్ తెలిపారు. 

ఆ దంపతుల నుంచి అండం, వీర్యం సేకరించి సరోగసీ చేస్తున్నట్లు చేస్తారని చెప్పారు. విశాఖలోని ఓ గర్భిణిని సరోగసీ మదర్‌ అని చూపించి మోసం చేశారని,  కొన్నాళ్ళు గడిచిన తర్వాత విశాఖ హాస్పిటల్లో ఓ బాబును పిల్లలు కావాలనుకునే దంపతులకు ఇచ్చారు. సరోగసీకి అంగీకరించిన మహిళ అదనంగా డబ్బు అడుగుతున్నట్లు చెప్పి డాక్టర్ వాటిని తీసుకున్నట్లు విచారణలో గుర్తించామని డీసీపీ తెలిపారు. 

ఈ కేసులో డాక్టర్ నమ్రత అసలు సరోగసీ పద్దతే చేయలేదు. శిశువు వద్దనుకున్న ఓ మహిళకు రూ.90వేలను చెల్లించారు. ఆమెకు శిశువు జన్మించగానే తీసుకున్నారు. ఆ తర్వాత దంపతులకు అనుమానం వచ్చి డీఎన్‌ఏ టెస్టు చేయిస్తే మ్యాచ్ కాకపోవడంతో ఆ బిడ్డ తమకు చెందినది కాదని తేలినట్లు డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు.