పాక్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 21 మంది మృతి

పాక్ మసీదులో ఆత్మాహుతి దాడి..  21 మంది  మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం బాంబు పేలుళ్లు సంభవించాయి. కోహట్‌లోని ఓల్డ్ పోలీస్ లైన్స్‌లో మసీదు సమీపంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో సంభవించిన పేలుళ్లలో 16 మంది పోలీసులతో సహా కనీసం 21 మంది చనిపోగా, మరో 30 మంది గాయపడ్డారని తెలుస్తోంది. పేలుడు పదార్థాలతో కూడిన వాహనం ఓల్డ్ పోలీస్ లైన్స్ గేట్‌ను ఢీకొట్టడంతో పేలుడు సంభవించిందని, ఆ వెంటనే కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు. 
 
పేలుడు తీవ్రతకు మసీదు వెలుపల పెద్ద గుంత ఏర్పడటంతోపాటు మసీదు గోడ కూలిపోయింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించాయి. కొహాట్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో 25 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉండటంతో హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

ఓల్డ్ పోలీస్ లైన్స్ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని క్లియరెన్స్ ఆపరేషన్ చేపడుతున్నారు. కోహట్-హంగ్ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు ఎలా సంభవించింది? దీనికి ఎవరు బాధ్యులు అనే విషయాన్ని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

పేలుడు తర్వాత తుపాకీ కాల్పులు కూడా చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.  ప్రస్తుతానికి ఏ సమూహమూ దీని బాధ్యతను స్వీకరించలేదు. అయితే, పాకిస్థాన్ భద్రతా దళాలను వ్యతిరేకించే  ‘తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్’ (టిటిపి)కు ప్రత్యర్థిగా ఉండే ‘ఇత్తెహాద్-ఉల్-ముజాహిదీన్ పాకిస్థాన్’ (ఐఎంపీ) అనే మిలిటెంట్ సంస్థ (ఇది గత ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటైంది) ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిందని కొన్ని ధృవీకరించని వార్తలు పేర్కొంటున్నాయి.

భారత్‌ను దెబ్బతీసేందుకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్థాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదానికి బలి అవుతోంది. పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు నిత్యకృత్యంగా మారాయి. 2023 జనవరి 30న పెషావర్ పోలీస్ లైన్స్ మసీదు వద్ద ఆత్మాహుతి జరిగింది. ఈ పేలుళ్లలో 100 మందికిపైగా మరణించగా, అందులో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారు.

అదే ఏడాది జులై నెలలో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ జిల్లాలో ఓ రాజకీయ పార్టీ సమావేశాన్ని లక్ష్యం చేసుకొని జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 60 మందికిపైగా చనిపోయారు. 2023 సెప్టెంబర్ 29 బలూచిస్థాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో మిలాద్ ఉల్ నబీ ఊరేగింపు సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 2022 మార్చి 4న పెషావర్‌లోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న కూచా రిసాల్దర్ షియా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడులో 63 మంది చనిపోగా, 190 మందికి పైగా గాయపడ్డారు.