* నిర్దుష్టమైన చర్యలకోసం భారత్ డిమాండ్
జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎం) అధిపతి మసూద్ అజార్ను తన మోస్ట్-వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో కొనసాగించడం, అలాగే అతని అరెస్టు లేదా శిక్షకు దారితీసే సమాచారం కోసం బహుమతిని పెంచడంపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. ఈ చర్యను న్యూఢిల్లీ ఒక “బూటకపు” చర్యగా అభివర్ణిస్తూ, ఇస్లామాబాద్ గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ బహుమతిపై పాకిస్తాన్ తాజా వైఖరికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, ఇలాంటి ప్రకటనలు గతంలోనూ చేశారని, వాటివల్ల పెద్దగా పర్యవసానాలు ఉండలేదని చెప్పారు.
“పాకిస్తాన్ చేసే ఇలాంటి జిమ్మిక్కులు, ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా మనం ఇలాంటి జిమ్మిక్కులను చూశాం. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశం ఇలాంటి బూటకపు ప్రకటనలు చేయడం ఎంత డొల్లగా ఉంటుందో మనందరికీ తెలుసు. చివరికి ఎలాంటి పర్యవసానాలు లేని ప్రకటనలు చేయడం కాకుండా, పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకోవాలి…” అని తెలిపారు. ప్రకటనలు చేయడం కాకుండా ఉగ్రవాద సంస్థలు, వాటి నాయకత్వంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్పై ఉందని స్పష్టం చేసింది.
పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) తన 2026 మోస్ట్-వాంటెడ్ టెర్రరిస్టుల రెడ్ బుక్లో అజార్ను కొనసాగించింది. అతని “అరెస్ట్ లేదా శిక్షకు” నేరుగా దారితీసే సమాచారం అందించిన వారికి ఇచ్చే బహుమతి, 2021లో అతన్ని తొలిసారి జాబితాలో చేర్చినప్పుడు ఉన్న 50 లక్షల పాకిస్తానీ రూపాయలనుండి ఇప్పుడు 70 లక్షల పాకిస్తానీ రూపాయలకు పెరిగింది.
జెఎమ్ చీఫ్ వాస్తవానికి ఎక్కడ ఉన్నాడనే దానిపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అజార్ ఆచూకీపై మళ్లీ దృష్టి సారించారు. అజార్ దేశం విడిచి ఆఫ్ఘనిస్తాన్లో దాక్కున్నాడని 2021 నుండి పాకిస్తాన్ చెబుతూ వస్తోంది. అయితే, అతను ఇప్పటికీ పాకిస్తాన్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండవచ్చని భారత నిఘా వర్గాల అంచనాలు సూచిస్తున్నాయి.
గత ఆరు నెలలుగా సేకరించిన సాంకేతిక నిఘా సమాచారం ప్రకారం, అజార్ ప్రస్తుతం సింధ్లోని నవాబ్షాలో దాక్కుని ఉండవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితా పరిమాణం కూడా గణనీయంగా పెరిగింది. 2021లో ఎఫ్ఐఏ రెడ్ బుక్లో 1,330 పేర్లు ఉండగా, తాజా ఎడిషన్లో 1,804 పేర్లు ఉన్నాయి. ఇది ఐదేళ్లలో సుమారు 35% పెరుగుదల.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలకు గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం అనే మూడు పరస్పర అంశాలపై ఆధారపడి ఉండాలని జైస్వాల్ పునరుద్ఘాటించారు. భారత్-చైనా సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత తప్పనిసరి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారని చెప్పారు.

More Stories
కిషౌ నీటి ప్రాజెక్టు ఒప్పందంపై ఆరుగురు ముఖ్యమంత్రుల సంతకాలు
రాజస్థాన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిక్యంలో బీజేపీ
దుర్గా పూజ తర్వాత బీజేపీలో చేరనున్న టీఎంసీ రెబెల్స్?