భేదాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదని భారత్, చైనా ప్రకటన

భేదాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదని భారత్, చైనా ప్రకటన

“భేదాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదు” అని పేర్కొంటూ, “సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం” కోసం తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ ప్రకటించారు  ఆరేళ్ల క్రితం చైనా చొరబాట్ల తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాల మధ్య ఏడేళ్లలో భారతదేశంలో వారిద్దరూ తొలిసారి సమావేశమయ్యారు. “రెండు దేశాలు తమ సంబంధాలపై వ్యూహాత్మక , దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండాలి” అని స్పష్టం చేశారు. 

భారత్,  చైనాలు ఒకరి బలాల నుండి మరొకరు నేర్చుకోవాలని, అలాగే అత్యున్నత స్థాయి బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని  జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. సరిహద్దు వివాదాల కారణంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకునే లక్ష్యంతో, 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇద్దరు నేతలు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. 

ఒక సంవత్సర కాలంలో వారు జరుపుకున్న రెండవ సమావేశం ఇది. ఇది దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. అంతకుముందు, ఆగస్టు 31, 2025న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనాలోని టియాంజిన్‌లో వారు సమావేశమయ్యారు.  జిన్‌పింగ్ కి స్వాగతం పలుకుతూ, బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడంలో న్యూఢిల్లీకి బీజింగ్ అందించిన మద్దతు, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.
 
తమ మధ్య జరిగిన ఈ ద్వైపాక్షిక సమావేశం సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. “వ్యూహాత్మక దృక్పథంతో ద్వైపాక్షిక సంబంధాల దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చైనా-భారత్ సంబంధాలు అభివృద్ధి చెందాయి,” అని ప్రధాని మోదీతో సమావేశంలో షీ తెలిపారు. భారత్, చైనాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, పరస్పరం సహకరించుకుంటూ ఉమ్మడి అభివృద్ధిని సాధించగల అంశాలను రెండు దేశాలు గుర్తించాయని  జిన్‌పింగ్‌ చెప్పారు. 
 
12 ఏళ్లలో న్యూఢిల్లీకి రావడం ఇది రెండోసారని కూడా ఆయన గుర్తుచేశారు. ఈ కాలంలో, తాను, ప్రధాని మోదీ 20 సార్లకు పైగా సమావేశమయ్యామని, “అనేక ముఖ్యమైన ఏకాభిప్రాయాలకు” వచ్చామని ఆయన చెప్పారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా, ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి)లో సభ్యులుగా ఉన్న ఈ రెండు దేశాల పాత్రను ఆయన నొక్కిచెప్పారు. ఉమ్మడి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇది వారికి కీలక పాత్రను కల్పిస్తుందని  జిన్‌పింగ్‌  పేర్కొన్నారు. 
 
“రెండు దేశాలు భిన్నమైనవి అయినప్పటికీ, ఉమ్మడి అభివృద్ధిని సాధించడానికి మనం ఒకరికొకరు మద్దతు, సహాయం అందించగలిగాము. చైనా, భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు, ‘గ్లోబల్ సౌత్’లో భాగం. మానవాళికి ఉమ్మడి భవిష్యత్తు ఉన్నందున మనపై ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. ప్రజలే పునాదిగా అత్యున్నత స్థాయి సహకారాన్ని ప్రోత్సహించడం కొనసాగించాలి” అని ఆయన అభిలాషను వ్యక్తం చేశారు. 

‘‘గత శతాబ్దంలో ఎన్నడూ చూడని తీవ్రమైన మార్పులు, అపూర్వమైన మహమ్మారి సమయాల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా ‘గ్లోబల్ సౌత్’లోని కీలక సభ్యులుగా చైనా-భారత్‌లపై గురుతర బాధ్యత ఉంది. ఇరుదేశాలు మానవాళి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మన ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ, అగ్రదేశాలుగా తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలి. మనం సమానత్వంతో కూడిన, క్రమబద్ధమైన బహుళ ధ్రువ ప్రపంచాన్ని ఆకాంక్షించాలి. స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, సమృద్ధి కోసం మరింత సానుకూల శక్తిని అందించాలి’’ అని  జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు.
 
“మీకు సాదర స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మీరు చేసిన సానుకూల వ్యాఖ్యలకు చాలా ధన్యవాదాలు. భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సమయంలో చైనా అందించిన మద్దతు, సహకారానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను,” అని ప్రధాని మోదీ తెలిపారు. “ఇప్పుడు మనం ద్వైపాక్షిక సహకారంపై చర్చించే అవకాశం ఉంది. మరోసారి, భారత్‌కు సాదర స్వాగతం,” అని ఆయన పేర్కొన్నారు.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ సమావేశంలో ప్రధానమంత్రి, “పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనం అనే మూడు పరస్పర సూత్రాల ద్వారా ఇరుపక్షాలు మార్గనిర్దేశం చేయబడాలి” అని నొక్కి చెప్పారు. “ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత ఒక ముఖ్యమైన ప్రాతిపదికగా మిగిలి ఉన్నాయి” అని మోదీ పేర్కొన్నారు. 

సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు,  అవగాహనలను ఇరుపక్షాలు పాటించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. “తమ మొత్తం ద్వైపాక్షిక సంబంధాల రాజకీయ దృక్పథం, ఇరు దేశాల ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి ఇద్దరు నాయకులు తమ నిబద్ధతను వ్యక్తం చేశారు,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.