చైనాలోని క్వింగ్డావో పోర్టులో భారీ విషాదం చోటుచేసుకుంది. మరమ్మతుల కోసం పోర్టులో నిలిపి ఉంచిన లైబీరియా జెండాతో ప్రయాణించే ‘ఓషియన్ మెలోడీ’ కార్గో నౌకలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 42 మంది ఉన్నట్లు సమాచారం.
వీరిలో 12 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. క్వింగ్డావో లోని బీహై షిప్బిల్డింగ్ కంపెనీ వద్ద నౌక మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో నౌకలో మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. దాదాపు మూడు గంటలపాటు సహాయక బృందాలు శ్రమించిన అనంతరం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్పందిస్తూ గల్లంతైన వారిని గుర్తించి రక్షించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు అధికారిక మీడియా తెలిపింది. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నౌక మరమ్మతులు జరుగుతున్న సమయంలో మంటలు ఎలా చెలరేగాయనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
ప్రధానమంత్రి లీ కియాంగ్, “చిక్కుకున్న సిబ్బందిని రక్షించడం, గాయపడిన వారికి చికిత్స అందించడం”పై దృష్టి పెట్టాలని, అదే సమయంలో “ద్వితీయ విపత్తులను నివారించాలని” అత్యవసర బృందాలను ఆదేశించినట్లు సీసీటీవీ నివేదిక తెలిపింది. పని ప్రదేశాలలోని ప్రమాదాలను క్షుణ్ణంగా గుర్తించి, పెద్ద ప్రమాదాలను నివారించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన దేశంలోని అత్యున్నత కార్మిక భద్రతా సంస్థను కూడా ఆదేశించారు.
క్వింగ్డావో బెహై అనేది చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ చే నిర్వహించే ఒక ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రం. ఇది వాణిజ్య నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, ఆఫ్షోర్ ఇంజనీరింగ్లో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ సౌకర్యాలు 9 కిలోమీటర్ల (5.6 మైళ్ల) తీరప్రాంతం వెంబడి 330 హెక్టార్ల (815 ఎకరాల) విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.

More Stories
మహిళల ఆసియా కప్లో పదో సారి ఫైనల్కు భారత్
రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి ఒక్కరికి రూ.4 లక్షలు.. ట్రంప్ సంచలన హామీ
బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రహమాన్ దూరం