‘మిస్టర్ సింగ్’ పోస్టర్ తో ట్రంప్ బృందం జాత్యాహంకార వ్యాఖ్యలు

‘మిస్టర్ సింగ్’ పోస్టర్ తో ట్రంప్ బృందం జాత్యాహంకార వ్యాఖ్యలు
 డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకటనలో భారతీయులను ఉద్దేశించి జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ‘ట్రాన్స్‌ఫార్మర్స్’ సినిమాను పారడీ చేస్తూ రూపొందించిన ఈ డిజిటల్ పోస్టర్‌లో, ఒక రోబో తలపాగా ధరించిన గోధుమ రంగు చర్మం కలిగిన వ్యక్తిని ఎదుర్కొంటూ అతడ్ని ‘మిస్టర్ సింగ్’ అని సంబోధిస్తుంది. 
 
ఈ పోస్టర్‌ను అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డిహెచ్ఎస్) ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అందులో ట్రాన్స్‌ఫార్మర్స్ ఫ్రాంచైజీకి చెందిన ప్రధాన పాత్ర ‘ఆప్టిమస్ ప్రైమ్’ డిహెచ్ఎస్ ఆర్మ్ ప్యాచ్‌తో కనిపిస్తుంది. గడ్డం ఉన్న ఆ వ్యక్తితో ‘మా రోడ్లపై నుంచి వెళ్లిపో, నీకు డ్రైవింగ్ రాదు మిస్టర్ సింగ్’ అనే సందేశం ఈ పోస్టర్‌లో ఉంది. అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వీడేలా ప్రోత్సహించడానికి ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రచారంలో భాగంగా ఈ ప్రకటన వచ్చింది. 

 సింగ్ అని పోస్ట‌ర్‌లో నేరుగా చెప్ప‌డం వ‌ల్ల‌.. అది ఇండో అమెరిక‌న్ల‌ను, ముఖ్యంగా సిక్కు గ్రూపుల‌ను టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. యూ డోన్ట్ నో హౌ టూ డ్రైవ్ అన్న ట్యాగ్‌లైన్ రాయ‌డం ఇటీవ‌ల అమెరికాలో జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాల‌ను చూచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆంగ్ల ప్రావీణ్యత పరీక్షలలో విఫలమైనందుకు 26,000 మందికి పైగా వాణిజ్య డ్రైవర్లను విధుల నుండి తొలగించగా, వేగంగా మారుతున్న విధానాల వల్ల ప్రభావితమైన ట్రక్కర్ల కోసం సిక్కు సమూహాలు పంజాబీ భాషా వనరులను,  చట్టపరమైన మద్దతును సమకూరుస్తున్నాయి.  

ట్ర‌క్కు డ్రైవ‌ర్లుగా అమెరికాలో నివ‌సిస్తున్న డాక్యుమెంటేష‌న్ లేని భార‌తీయుల్ని డిపోర్ట్ చేయాల‌ని అమెరికా భావిస్తున్న‌ది. క‌మ‌ర్షియ‌ల్ ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌ను ఇటీవ‌ల అమెరికా స‌ర్కారు క‌ఠినంగా స్క్రూట్నీ చేస్తున్న‌ది. క‌మ‌ర్షియ‌ల్ డ్రైవ‌ర్స్ లైసెన్సు జారీ అంశంలో రూల్స్‌ను కూడా ప‌క‌డ్బందీగా చేసింది. అయితే పోస్ట‌ర్‌లో సింగ్ అని పేరు పెట్ట‌డం.. అది జాతివివ‌క్ష‌కు దారి తీస్తుంద‌ని విమ‌ర్శ‌కులు స్పష్టం చేస్తున్నారు.

ఈ ప్రచారం కోసం ‘స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లండి లేదా పర్యవసానాలు అనుభవించండి’ అనే నినాదాన్ని హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఉపయోగిస్తోంది. దీంతో పాటు ఏఐతో రూపొందించిన ఓ చిన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అందులో ట్రాన్స్‌ఫార్మర్స్ ఫ్రాంచైజీలోని ప్రతి నాయక పాత్ర ‘మెగాట్రాన్’, అమెరికా ప్రభుత్వం విదేశీయులను వర్ణించడానికి ఉపయోగించే “ఏలియన్స్” విడుదల గురించి చర్చలు జరుపుతున్నట్లు చూపించారు. 
 
రహదారి ప్రమాదాలు, ఇతర నేరాలలో ప్రమేయం ఉన్న ట్రక్ డ్రైవర్లు హర్జిందర్ సింగ్, రాజిందర్ కుమార్, బెక్జాన్ బీషెకీవ్, అఖ్రోర్ బోజోరోవ్, జస్వీర్ సింగ్‌లను విడుదల చేయాలని మెగాట్రాన్ కోరుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ‘‘ మీరు శత్రుత్వంతో ఈ దేశాన్ని సమీపిస్తే ఇది తెలుసుకోండి. మమ్మల్ని మేము రక్షించుకుంటాం. మేము అమెరికనిజాన్ని రక్షించుకుంటాం. మా ఇంటిని రక్షించుకుంటాం’’ అని పేర్కొంది.
 
‘సింగ్’ అనే ఇంటిపేరును హిందువులు, సిక్కులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అమెరికా ట్రక్కింగ్ రంగంలో ప్రధాన పాత్ర వీరిదే. అయితే ఈ పోస్టర్‌లోని వ్యాఖ్యలు కేవలం అక్రమ వలసదారులను మాత్రమే కాకుండా, అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన ప్రజలందరినీ లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉన్నాయి. విచిత్రమేమిటంటే అమెరికా వ్యవస్థకు ప్రతీకగా ఈ పోస్టర్‌లో ఉపయోగించిన రోబో పాత్ర ఆ కథల ప్రకారం నిజానికి ఓ ఏలియన్.

ఈ ప్రకటనలో ‘మిస్టర్ సింగ్’ అని ప్రస్తావించడంపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్), సిక్కు కొయలేషన్ వంటి అనేక ప్రతినిధి సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘సింగ్‌లు’ హిందువులు, వారు సిక్కులు, వారు అమెరికన్లు, వారు వాహనాలు నడుపుతారు. ట్రంప్ ప్రభుత్వం చేసిన ఈ జాత్యాహంకార, భారత వ్యతిరేక వ్యాఖ్యలు షాక్‌కు గురిచేస్తున్నాయి’’ అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్ లో పేర్కొంది.

“ఫెడరల్ ఏజెన్సీ చేసిన ఈ వివక్షాపూరిత పోస్ట్ రాజకీయ సందేశాలకు అతీతంగా ఉంది. దీనిపై తక్షణ విచారణను మేము స్వాగతిస్తున్నాం’’ అని పేర్కొంటూ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌కు హిందూ అమెరికన్ ఫౌండేషన్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మీత్ కె ధిల్లాన్ ట్యాగ్ చేశారు. ‘‘9/11 దాడి జరిగి పాతికేళ్లు గడిచినా ఇప్పటికీ సిక్కులు తమ రూపం ఆధారంగా లక్ష్యంగా మారుతున్నారు’’ అని సిక్కు సమాజం ఆవేదన వ్యక్తం చేసింది.
‘‘అమెరికాలోని మిలియన్ల మంది సిక్కుల ఇంటిపేరు ‘సింగ్’, దానికి అర్థం సింహం. మా ప్రభుత్వమే మమ్మల్ని శత్రువులుగా చిత్రీకరించినప్పటికీ, మేము సిక్కులుగా గుర్తింపుపొందడానికి భయపడం’’ అని సిక్కు కోయలిషన్ తెలిపింది. అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వీడేందుకు ఉద్దేశించిన ‘సిబిపి హోమ్’ కార్యక్రమాన్ని ప్రచారం చేసేందుకు ట్రంప్ యంత్రాంగం ఈ ప్రయత్నం చేస్తోంది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లడానికి నమోదు చేసుకున్న వారికి ప్రయాణ సహాయంతో పాటు 2,600 డాలర్ల ఎగ్జిట్ బోనస్ కూడా లభిస్తుందని డిహెచ్ఎస్ తెలిపింది.