జాతీయ రాజధానిలో సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జరగనున్న బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో, సిసిటివి కెమెరాల ఏర్పాటు నుండి పోలీసు బలగాల మోహరింపు వరకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వారం జరగనున్న సదస్సు సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో, బ్రిక్స్ ప్రతినిధుల కోసం ప్రత్యేక ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, విమానాల ల్యాండింగ్, పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సిసిటివి కంట్రోల్ రూమ్ ద్వారా 500 సిసిటివి కెమెరాల సహాయంతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ కంట్రోల్ రూమ్ పరిధిలో న్యూఢిల్లీ జిల్లాలోని ప్రధాన రహదారులలో సగం భాగం, అలాగే విదేశీ అతిథులు బస చేసే ఆబ్రే హోటల్, తాజ్ మాన్ సింగ్ హోటల్ వంటి ప్రాంతాలు ఉంటాయి. భారత్ మండపం చుట్టూ బహుళ-స్థాయి భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, విమానాశ్రయం, హోటళ్లు, సదస్సు వేదికను కలిపే కీలక మార్గాల్లో భద్రతా సంస్థలు నిఘా ఉంచుతాయని అధికారులు తెలిపారు.
ఈ భద్రతా వ్యవస్థలో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ఎన్ ఎస్ జి, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్ పి జి సిబ్బంది వివిధ ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. దీనితో పాటు, వివిఐపిల రాకపోకల సమయంలో న్యూఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపుల కోసం 35కి పైగా ప్రధాన రహదారులను గుర్తించారు.
ఇదే సమయంలో, బ్రిక్స్ సదస్సు కోసం న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్ఎండిసి) నగరాన్ని అందంగా తీర్చిదిద్దే ఉద్యానవన పనులను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 15,000కు పైగా కుండీలలోని మొక్కలను ప్రదర్శించడం, 15 ప్రాంతాల్లో పూలతో చేసిన బోర్డులను ఏర్పాటు చేయడం వంటి ప్రణాళికలు ఉన్నాయి. ఎన్ఎండిసి తొమ్మిది ప్రముఖ ప్రదేశాలలో పూల ఫౌంటైన్లను కూడా ఏర్పాటు చేయనుంది.
కీలక మార్గాల్లో అందాన్ని, దృశ్యమానతను మెరుగుపరచడానికి కంచె మొక్కలు, అలంకారిక మొక్కల కత్తిరింపులు, అలాగే చెట్ల కొమ్మల కత్తిరింపు పనులు కూడా నిర్వహిస్తోంది. మార్కెట్లు, హోటళ్లు, నగర ప్రవేశ మార్గాలు, రోడ్డు మధ్యలో ఉండే విభజన ప్రాంతాలు, వీఐపీ మార్గాలపై – ముఖ్యంగా ‘భారత్ మండపం’కు దారితీసే మార్గాలపై – ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎన్ఎండిసి తెలిపింది.
భారత్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్సదస్సు జ్ఞాపకార్థం 2016లో చాణక్యపురిలో ఏర్పాటు చేసిన ‘బ్రిక్స్ ఫ్రెండ్షిప్ రోజ్ గార్డెన్’లో కూడా ఎన్ఎండిసి ఉద్యానవన, సౌందర్యీకరణ పనులను ముమ్మరం చేసింది. సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తోటలో 107 రకాల గులాబీ మొక్కలు ఉన్నాయి.

More Stories
నర్మదా తీరంలో ‘జాతీయ చలనచిత్ర అవార్డుల’ వేడుక
ఛత్తీస్గఢ్లో 14 మావోయిస్టుల డంప్లు గుర్తింపు
పీజీ హాస్టళ్లలో భద్రత, కనీస సౌకర్యాలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్