మూడు రకాల ‘ఎవరెస్ట్‌’ మసాలాలపై నిషేధం!

మూడు రకాల ‘ఎవరెస్ట్‌’ మసాలాలపై నిషేధం!
దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల నాణ్యత, హోటళ్లలో పరిశుభ్రతపై ఇటీవల తనిఖీలు ఎక్కువయ్యాయి. నిర్దేశించిన ప్రమాణాలు లేని ప్రొడక్ట్స్‌పై చర్యలు తీసుకుంటున్న భారత ఆహార భదత్ర, ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తాజాగా ఎవరెస్ట్ ఉత్పత్తులపై నిషేధం విధించింది.  ఆహార ఉత్పత్తుల్లో దూసుకెళ్తున్న ఎవరెస్ట్ బ్రాండ్‌కు చెందిన మూడు రకాల మసాలాను పరీక్షించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నాణ్యత లోపాన్ని గుర్తించింది. 
 
వెంటనే సదరు ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసింది. ఒక వినియోగదారుడి ఫిర్యాదు మేరకు ముంబై, అంబెర్గావ్‌(గుజరాత్‌)లోని ఎవరెస్ట్ మసాలా తయారీ యూనిట్ల నుంచి శాంపిల్స్ సేకరించారు అధికారులు. ఇంగువ(అసఫోటిడా), లాల్జీ గొధూ నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించగా ఈ ఉత్పతుల్లో నాణ్యత కొరవడడం బయటపడింది. 
 
వీటితో పాటు ఎగ్ కర్రీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా తయారీ కూడా ఆమోదయోగ్యంగా లేదు. దాంతో, నిర్దేశించిన ప్రమాణాలు పాటించకుండా తయారు చేసి విక్రయిస్తున్న ఈ మూడు రకాల అమ్మకాలపై కొరడా ఝులిపించింది. అంతేకాదు నిబంధనల ఉల్లంఘనకు కారణాలతో పాటు నిర్దేశిత ప్రమాణాలు పాటించడం కోసం తీసుకోబోయే చర్యలను తమకు వివరించాలని ఎవరెస్ట్ బ్రాండ్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు స్పష్టం చేశారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  చట్టం 2006 నిబంధన ప్రకారం ఇంగువలో ఆల్కహాల్‌లో కరిగిపోయే పదార్థం కనీసం 5 శాతం ఉండాలి. కానీ, ఎవరెస్ట్ ఇంగువలో ఇది సున్నా నుంచి మూడు శాతమే ఉంది. అంతేకాదు తయారీ సమయంలో అవసరమైన దానికంటే 30 – 40 శాతం తక్కువ ముడి ఇంగువ వాడుతున్నారని అధికారులు వెల్లడించారు.  లాల్‌జీ గోధూ యూనిట్ నుంచి సేకరించిన ఆరు రకాల ముడి ఇంగువలో 15 నుంచి 32 శాతం పిండిపదార్ధం ఉంది. అయితే నిర్దేశిత ప్రమాణాల ప్రకారం స్టార్చ్ మోతాదు ఒక్క శాతం మించకూడదు.