ఆగష్టు 31న నేవీలో చేరనున్న దేశీయ ఐఎన్‌ఎస్‌ నిపుణ్

ఆగష్టు 31న నేవీలో చేరనున్న దేశీయ ఐఎన్‌ఎస్‌ నిపుణ్

భారత నౌకాదళానికి మరో అదనపు శక్తి చేకూరనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఎన్‌ఎస్‌ నిపుణ్ ఆగష్టు 31న, ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నావికాదళంలో చేరనుంది. ఇది దేశీయంగా రూపొందిన రెండో డైవింగ్ సపోర్ట్ వెస్సెల్ (డీఎస్‌వీ). ఐఎన్‌ఎస్‌ నిపుణ్ నౌక పొడవు 118 మీటర్లు కాగా, ఇది సుమారు 8,560 టన్నుల బరువు (డిస్‌ప్లేస్‌మెంట్) కలిగి ఉంటుంది.

సముద్రంపై మన నావికా సామర్ధ్యాన్ని పెంచేందుకు, తీరానికి దూరంలో, లోతులో అన్వేషణ సాగించడంలో ఐఎన్‌ఎస్‌ నిపుణ్ ఉపయోగపడనుంది. భారత్ కొంతకాలంగా చెబుతున్న ఆత్మనిర్భర భారత్‌ లక్ష్య సాధనలో భాగంగా ఈ నౌక, 80 శాతం దేశీయ సాంకేతికతతోనే రూపొందింది. ఈ నౌకను విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్‌) సంస్థ రూపొందించింది. గత జూలై 30న దీన్ని హెచ్‌ఎస్‌ఎల్‌ సంస్థ ఇండియన్ నేవీకి అప్పగించింది.

అప్పటికే పూర్తిస్థాయి నిర్మాణం, ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ప్రధానంగా సముద్ర అంతర్భాగంలో కార్యకలాపాల కోసం ఈ నౌకను రూపొందించారు. ఆధునిక డైవింగ్ సిస్టమ్‌తో దీన్ని అభివృద్ధి చేశారు. ఇది డీప్ సీ శాచురేషన్ డైవింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందుకోసం ఓ వైపు డైవింగ్ స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. ఇది నీటిపైనే తేలియాడుతుంది. 

కానీ, ఇందులోని డైవర్లు, ఆధునిక రోబోలు, రెస్క్యూ వెహికల్స్ వంటివి అత్యవసర పరిస్థితుల్లో సముద్రంలో డైవింగ్ చేసే సిబ్బందికి సాయం చేయగలదు. వైద్య సాయం అందించగలదు. సబ్‌మెరైన్లను రక్షించే చర్యల్లో పాల్గొని, సబ్‌మెరైన్లకు అండగా ఉంటుంది. నీటిపైన ఉంటూనే, సముద్రం లోపల సాయం అందించడంలో సాయపడుతుంది.