‘ఒక దేశం, ఒక ఎన్నిక’ ప్రతిపాదనను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ కొనసాగుతున్న చర్చలలో అత్యధికులు ఏకకాలం ఎన్నికల విధానంకు మద్దతు తెలుపుతున్నారని జెపిసి చైర్మన్ పి.పి. చౌదరి తెలిపారు. కమిటీ ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపిందని చెబుతూ “మేము ఇప్పటివరకు మాట్లాడిన వారిలో 99 శాతం మంది ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ విధానానికి అనుకూలంగా ఉన్నారు,” అని చౌదరి పేర్కొన్నారు.
తగినంత రాజకీయ సంకల్పం ఉంటే ఈ విధానాన్ని 2029లోనే అమలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ కమిటీ సోమవారం జరిపిన చర్చల్లో పలువురు ప్రముఖ ప్రతిపక్ష నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రతిపాదిత ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ విధానాన్ని 2034కు బదులుగా 2029లోనే అమలు చేయవచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఒకవేళ ఇది అమలైతే, 2029లో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరిగే అవకాశం ఉంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమం చేసే 129వ రాజ్యాంగ సవరణ బిల్లును జెపిసి ప్రస్తుతం పరిశీలిస్తోంది. సోమవారం జరిగిన ఈ సమావేశానికి J చౌదరితో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, టిఎంసి ఎంపీ సాగరిక ఘోష్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే తదితర సభ్యులు హాజరయ్యారు.
ఏకకాల ఎన్నికల వల్ల సమాఖ్య వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రభావం పడవచ్చని వాదిస్తూ, ప్రతిపక్ష పార్టీలు ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జెపిసి సమావేశంలో ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ ప్రతిపాదనపై పి. చిదంబరం తన పార్టీ వైఖరిని వివరించారని కూడా చౌదరి చెప్పారు. భారతదేశం గతంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే విధానాన్ని అనుసరించింది.
1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించబడ్డాయి. 1957, 1962లలో కూడా ఇదే విధానం కొనసాగింది. 1967లో లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. అయితే, 1967 తర్వాత అనేక రాష్ట్రాల శాసనసభలు రద్దు చేయబడి, ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడంతో ఈ విధానానికి అంతరాయం కలిగింది.
1972 సాధారణ ఎన్నికలు కూడా నిర్ణీత సమయం కంటే ముందే జరగడంతో, ఏకకాల ఎన్నికల ప్రక్రియలో ఈ క్రమం మరింతగా దెబ్బతిన్నది. ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదన ఏకకాల ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2029లో ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేస్తే, లోక్సభ ఎన్నికలతో సమకాలీకరించడానికి అనేక రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని తగ్గించాల్సి రావచ్చు.
2028లో ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం ఉన్నాయి. ప్రస్తుత విధానం ప్రకారం, 2028లో ఎన్నికయ్యే శాసనసభల పదవీకాలం సాధారణంగా 2033 వరకు ఉంటుంది. అయితే, 2029లో ఏకకాల ఎన్నికలు నిర్వహిస్తే, వాటి పదవీకాలాన్ని దాదాపు నాలుగేళ్లు తగ్గించాల్సి ఉంటుంది.
2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలు ఏడు ఉన్నాయి. అవి: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో ఎన్నికయ్యే శాసనసభల పదవీకాలం సాధారణంగా 2032 వరకు కొనసాగుతుంది. అయితే, 2029లో ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేస్తే, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను వాటి సాధారణ పదవీకాలం ముగియడానికి దాదాపు మూడేళ్ల ముందే నిర్వహించాల్సి ఉంటుంది.

More Stories
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి.. వేధింపులతో కుటుంభం బలి
పండుగల ముందు వేడి పుట్టిస్తున్న ఉల్లిపాయ, చక్కెర ధరలు
పంజాబ్లో అన్ని స్థానాల్లో బిజెపి ఒంటరిగానే పోటీ