పాక్ ఆగడాలకు నిరసనగా పీవోకేలో లాంగ్‌మార్చ్

పాక్ ఆగడాలకు నిరసనగా పీవోకేలో లాంగ్‌మార్చ్
* పాకిస్థాన్ అసెంబ్లీ నుండి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ప్రయత్నం?
 
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడానికి విధించిన గడువు ముగియడంతో ది జమ్ము కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెఎఎసి) ఉద్యమాన్ని తీవ్రం చేసింది. పీవోకే లోని ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు వీలుగా నిత్యావసర వస్తువులపై రాయితీలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు గుర్తింపు తదితర 38 డిమాండ్లు నెరవేర్చాలని జేఏఏసీ కోరుతోంది. 
 
పాకిస్తాన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఆ నేతల అకృత్యాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది. రావల్‌కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు 40 వేల మంది నిరసనకారులు లాంగ్ మార్చ్ చేపట్టారు.   పీవోకే రాజధానిగా చెప్పబడుతున్న ముజఫరాబాద్ వైపు నిరసనకారులు నేడు ర్యాలీగా తరలివెళ్తున్నారు. 
 
ఈ క్రమంలో వారు పాకిస్థాన్ అసెంబ్లీ నంచి స్వాతంత్ర్యం ప్రకటించుకునే అవకాశం ఉంది. పీవోకేలోని రావల్కోట్‌లో నిరసన జరుగుతున్న వీడియోలలో వేలాది మంది ప్రజలు కనిపించారు. ఈ ప్రదర్శనలో వందలాది మంది చిన్నారులు కూడా పాల్గొంటున్నారు. వోకేలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి యూనిఫాంలో రావల్కోట్‌లోని ఈద్గా మైదానంలో గుమిగూడారు. 
 
వారు తెల్ల జెండాలను ఊపుతూ పీవోకేలో పాకిస్థాన్ సైన్యం క్రూరమైన చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా పిల్లలకు ఏమైనా జరిగితే ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జేఏఏసీ  బాధ్యత వహించాల్సి ఉంటుందని పాకిస్థాన్ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం 4 వేల మంది రేంజర్లు ( భద్రతా సిబ్బంది )ని వివిధ నగరాలు, పట్నాల్లో మోహరించింది.
మీడియాను కూడా నిషేధించారు. 
 
భారీ స్థాయిలో రేంజర్లు, పోలీస్ బలగాలు మోహరించినా నిరసనలు ఆగలేదు. మంగళవారం జరిగిన నిరసనల్లో తలెత్తిన ఘర్షణల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతకాలంగా పీవోకేలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో దాదాపు 40 లక్షల మంది ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని నిరసనకారులు తెలిపారు. ‘పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ స్వతంత్ర ప్రాంతం కాదు.. వివాదాస్పద ప్రాంతం కూడా కాదు, ఇది ఆక్రమణకు గురైన భాభాగం’ అని పీవోకే నిరసన ఉద్యమ నేత సర్దార్‌ అమన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.
 
పీఓకే చట్టసభలో స్థానికుల ప్రాతినిధ్యానికి గండిపడేలా ప్రభుత్వం పాక్ వాసులను ఎమ్మెల్యే సీట్లకు నామినేట్ చేయడంతో మొదలైన నిరసనలు అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తూ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం అరెస్టులు, ఇంటర్నెట్‌షట్‌డౌన్‌లు, భద్రతా దళాల మోహరింపులతో పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు.