అమెరికాలోని ఒక హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో అక్కడ పనిచేస్తూ నివసిస్తున్న గుజరాత్కు చెందిన భార్యాభర్తలు, వారి కుమార్తె మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గుజరాత్లోని ఖేడా జిల్లా నాడియాడ్కు చెందిన హితేష్భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషాని రెండేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డారు.
ఒహియోలోని ‘ఎకానో లాడ్జ్’లో హితేష్భాయ్ పనిచేస్తుండటంతో ఆ కుటుంబం అక్కడ నివసిస్తున్నది. కాగా, గురువారం తెల్లవారుజామున ఆ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ నివసిస్తున్న హితేష్భాయ్ కుటుంబం మంటలు గమనించి ఆందోళన చెందారు. సహాయం కోసం లాడ్జి ఫ్రంట్ డెస్క్కు ఫోన్ చేశారు. మరోవైపు ఫైర్ సిబ్బంది ఆ హాటల్ వద్దకు చేరుకున్నారు. పలు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు.
బాత్రూమ్ లోపల ఉన్న హితేష్భాయ్ కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దట్టంగా కమ్ముకున్న పొగకు ఊపిరాడక ఆ కుటుంబంలోని ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హితేష్భాయ్, అతడి భార్య, కుమార్తె మరణం గురించి గుజరాత్లోని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

More Stories
భగవత్ ప్రసంగంకు అనూహ్య స్పందన… రిజిస్ట్రేషన్లు నిలిపివేత
గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్లో చాంపియన్గా ప్రజ్ఞానంద
మలేషియా నుండి మయన్మార్ కు 1,500 మంది రోహింగ్యా శరణార్థులు