వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ తో సైబర్ నేరాలు?.. కేంద్రం బ్రేకులు

వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ తో సైబర్ నేరాలు?.. కేంద్రం బ్రేకులు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించింది. ఈ కొత్త అప్‌డేట్ వల్ల సైబర్ నేరాలు, ముఖ్యంగా ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి ఇతరులను బురిడీ కొట్టించే  ఆన్‌లైన్‌ మోసాలు  విపరీతంగా పెరిగే ముప్పు ఉందంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ ఫీచర్‌కు సంబంధించిన సెక్యూరిటీ లూప్‌హోల్స్‌పై ప్రభుత్వం సమగ్ర విచారణ, సమీక్ష చేపట్టినట్లు బుధవారం  వెలువడిన పలు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.   యూజర్ నేమ్ వల్ల ఫోన్ నెంబర్ తెలియదని, దీంతో ప్రముఖుల పేర్లతో, ఇతరుల పేర్లతో మోసానికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.  వినియోగదారులకు అసలు అకౌంట్ ఎవరికి సంబంధించిందో తెలిసే అవకాశం ఉండదు. అందుకే ఈ ఫీచర్ విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి అంశాలతో వివరణ ఇవ్వాలని కోరుతూ వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.  ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది, భద్రత ప్రమాణాలు వంటి అంశాలను వివరించాలని కోరింది.  అప్పటివరకు ఇండియన్స్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురాకూడదని ఆదేశించింది. ఈ ఫీచర్ విషయంలో కేంద్రానికి నివేదిక సమర్పించి, పూర్తి అనుమతులు పొందిన తర్వాతే ముందుకెళ్లాలని నోటీసుల్లో పేర్కొంది.
కాగా,  మోసాలు, నకిలీ ఖాతాల ప్రమాదాన్ని తగ్గించడానికి, ఈ కొత్త ఫంక్షన్‌ను పలు భద్రతా చర్యలతో ప్రవేశపెట్టనున్నట్లు వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ ఫీచర్ ఇంకా అందుబాటులో లేదని, ఈ ఏడాది చివర్లో దశలవారీగా విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. గతంలో పరీక్షల పేపర్ల లీకేజీ ఉదంతాలు, ఐడెంటిటీ దాచిపెట్టి క్రైమ్స్ చేయడానికి వేదికగా మారిన టెలిగ్రామ్ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
అదే తరహాలో ఈ కొత్త వ్యవస్థలో భద్రతా పరమైన జాగ్రత్తలు, మోసాలను అడ్డుకునే ఫిల్టర్లను అమర్చాల్సిన పూర్తి బాధ్యత వాట్సాప్ యాజమాన్యానిదే అని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌ను జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా రోల్ అవుట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ పర్సనల్ ఫోన్ నంబర్లను ఇతరులకు బహిర్గతం చేయకుండానే కేవలం ఒక ప్రత్యేక యూజర్‌నేమ్ ద్వారా చాట్ చేయవచ్చు. 
 
ఇది స్పామ్ కాల్స్, సిమ్-స్వాపింగ్ వంటి సైబర్ ముప్పుల నుంచి యూజర్ ప్రైవసీని కాపాడుతుందని వాట్సాప్ చెబుతోంది. సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థల పేర్లతో నకిలీ ఖాతాలు రాకుండా కొన్ని పేర్లను ముందస్తుగా లాక్ (రిజర్వ్) చేశామని సంస్థ పేర్కొంది. 50 కోట్లకు పైగా వినియోగదారులతో వాట్సాప్‌కు భారతదేశమే అతిపెద్ద మార్కెట్. 
ఈ నేపథ్యంలో, మోసగాళ్లు వివిధ బ్యాంకులు, ప్రముఖ బ్రాండ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా ప్రభుత్వ అధికారుల పేర్లను పోలిన యూజర్‌నేమ్‌లను చాకచక్యంగా సృష్టించి సామాన్యులను డిజిటల్ లూటీ చేసే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.