గతంలో భారతదేశానికి కేటాయించిన మొంగ్లా రేవు సమీపంలోని వ్యూహాత్మకంగా కీలకమైన భూమిని చైనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పగించింది. అక్కడ ప్రత్యేక ఆర్థిక జోన్ ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వ యాజమాన్య సంస్థతో బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ చైనా పర్యటనలో ఒక కీలక ఒప్పందంపై సంతకం చేశారు. దీని ద్వారా ఇరుదేశాల బంధం మరింత బలపడనుంది.
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు కేవలం 188 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంగ్లా నౌకాశ్రయం బంగ్లాదేశ్లో రెండో అతిపెద్ద పోర్ట్. బంగాళాఖాతంలో భారత్ నౌకాదళ ప్రాబల్యానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా అడుగుపెట్టడం న్యూఢిల్లీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో షేక్ హసీనా హయాంలో ఈ 110 ఎకరాల భూమిలో భారత సంస్థ అయిన హీరానందని గ్రూప్ సెజ్ నిర్మించాల్సి ఉంది.
బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం తర్వాత ఏర్పడిన మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం భారత్కు కేటాయించిన ఈ ప్రాజెక్ట్ను రద్దు చేసింది. ఒప్పంద గడువులోగా పనులు ప్రారంభించలేదనే సాంకేతిక కారణాన్ని చూపి భారత డెవలపర్ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించింది. దీనిని చక్కటి అవకాశంగా మలుచుకున్న చైనా, బంగ్లాదేశ్ కొత్త నాయకులను సంప్రదించి అత్యంత వేగంగా ఈ స్థలాన్ని దక్కించుకుంది.
పెరగనున్న డ్రాగన్ నిఘా ఈ చైనా ప్రాజెక్ట్ ద్వారా బంగాళాఖాతంలో డ్రాగన్ నిఘా కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని భారత రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో విస్తరణ కాంక్షతో ఉన్న చైనా, పాకిస్తాన్లోని గ్వాదర్ నుంచి ఆఫ్రికా తీరం వరకు పలు నౌకాశ్రయాలలో పెట్టుబడులు పెట్టింది. చైనాకు అవసరమైన ముడి చమురు రవాణాలో 80 శాతం ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుండటంతో ఈ ప్రాంతంలో పట్టు సాధించాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

More Stories
రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ల దాడి.. 13 మంది మృతి
లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం పోతే తక్షణమే అమెరికాను వీడాల్సిందే!