మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు

మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు
శాసన సభ్యుల సంతకాల ఫోర్జరీ కేసు దర్యాప్తులో భాగంగా  పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు మంగళవారం మమతా బెనర్జీ నివాసంలో సోదాలు చేపట్టారు. కోల్‌కతాలోని 30B, హరీశ్‌ ఛటర్జీ స్ట్రీట్‌లో ఉన్న ఆమె నివాసంలో సోదాలు నిర్వహించేందుకు సీఐడీ బృందం అక్కడకు వెళ్లడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. మమత ఇంటి చిరునామాతో తృణమూల్ కాంగ్రెస్ అధికారిక పార్టీ కార్యాలయం కూడా నమోదై ఉన్నందున తాము ప్రాంగణాన్ని తనిఖీ చేయాల్సి ఉందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. 
 
అయితే మాజీ ఎంపీ సుభాశిష్ చక్రవర్తితో సహా పలువురు టీఎంసీ నాయకులు అధికారులను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో నివాసం వెలుపల కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. మమతా బెనర్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇద్దరూ ప్రస్తుతం ఇంట్లో లేరని, కాబట్టి సోదాలకు అనుమతించలేమని, ఒకట్రెండు రోజుల తర్వాత రావాలని సుభాశిష్ చక్రవర్తి కోరారు.

అయితే దీనిపై సీఐడీ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. తాము చట్టప్రకారం విచారణకు వస్తే అడ్డుకోవడం నేరమని స్పష్టంచేశారు. కొద్దిసేపు ఘర్షణ తర్వాత సీఐడీ బృందం లోపలికి వెళ్లింది.  సీఐడీ బృందం మమత నివాస, కార్యాలయ సముదాయాల్లో ప్రవేశించి తనిఖీలు చేపట్టినట్లు టిఎంసి వర్గాలు తెలిపాయి. ఈ దర్యాప్తు కొనసాగుతున్న వేళ మరో సీఐడీ బృందం కామాక్ స్ట్రీట్లోని అభిషేక్ బెనర్జీ కార్యాలయాన్ని సందర్శించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

మే 20న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌కు తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఒక లేఖ సమర్పించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సోవన్ దేబ్ ఛటోపాధ్యాయను ఎన్నుకుంటూ ఈ లేఖను ఇచ్చారు.  అయితే ఈ లేఖపై ఉన్న తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ టీఎంసీ ఎమ్మెల్యేలు రితబ్రతా బెనర్జీ, సందీపన్ సాహా సంచలన ఆరోపణలు చేశారు. 

ఈ వివాదం ముదిరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ ఫోర్జరీ వ్యవహారంపై కోల్‌కతాలోని హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదుకాగా బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు నిర్వహించేందుకు రాష్ట్ర సీఐడీ ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.  ఇప్పటివరకు ఈ కేసులో 13 మంది టీఎంసీ ఎమ్మెల్యేల వాంగ్మూలాలను సీఐడీ నమోదు చేసింది.

స్పీకర్‌కు పంపిన ఆ వివాదాస్పద లేఖపై పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ సంతకం చేసినందున విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ ఆయనకు పలుమార్లు సమన్లు జారీ చేసింది.  అయితే అనారోగ్య కారణాలను చూపుతూ అభిషేక్ బెనర్జీ వ్యక్తిగతంగా హాజరు కాకుండా తనకు 15 రోజుల సమయం కావాలని కోరారు.