మొత్తం తెలుగు నేలను సా.శ.1199 నుంచి సా.శ.1262 వరకు ఏకచత్రాధిపత్యంగా పాలించిన కాకతీయ గణపతిదేవుని శిల్పం సిద్దిపేట జిల్లా తోటపల్లిలో గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి, చరిత్రకారుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్, శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
పురాతన స్థలాలు, చారిత్రక, వారసత్వ కట్టడాలు, అవశేషాలు పరిరక్షణ పై గ్రామీణులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా వారు సిద్దిపేట జిల్లా నంగునూరు, కొండపాక, తోటపల్లి, లకుడారం గ్రామాలను ఆదివారం నాడు సందర్శించారు. ఆ సందర్భంగా బెజ్జంకి మండలం తోటపల్లిలోని వారసత్వ తెలంగాణ శాఖ రక్షిత కట్టడమైన కాకతీయుల కాలపు శివాలయం రంగమండపంలోని ఒక శిల్పం ముమ్మాటికి కాకతీయ గణపతిదేవుడు, ఆయన భార్య సోమలదేవి, ఇంకా రాచగురువు విశ్వేశ్వర శివాచార్యులదేనని వారు చెప్పారు.
రాచగురువు సమక్షంలో శివదీక్ష తీసుకున్న గణపతిదేవుడు, రాచరికపు చిహ్నాలను పక్కన పెట్టి, తలపై శిఖ, వంటిపై రుద్రాక్షమాలలను ధరించి, శివలింగానికి పుష్పాభిషేకం చేస్తున్నట్లు ఉన్నారు. ద్రవిడ తమ్మిల్ల కేశాలంకారణతో నున్న సోమలదేవి కూడా పూజలో నిమగ్నమైనట్లు, చక్రవర్తికి కుడివైపున రాజగురువు గోళకి మఠాధిపతి విశ్వేశ్వర శివాచార్యుడు వారి చేత పూజలు చేస్తున్నట్లుగా నిలబడి ఉన్నాడని వారు వివరించారు. చక్రవర్తి, ఆయన భార్య, రాచ గురువుల తలలపైన రాజలాంఛనాలైన ఛత్రాలు ఉన్నాయని తెలిపారు.
ఎడమవైపున వింజామర వీస్తున్న పరిచారిక ఉన్న ఈ శిల్పం తోటపల్లి శివాలయం కాకతీయ వాస్తు శైలిలో నిర్మించబడిందని, అందుచేత చక్రవర్తి గణపతిదేవుడు, సోమలదేవిగా గుర్తించినట్లు చెప్పారు. 60 ఏళ్లకు పైగా పాలించిన కాకతీయ గణపతిదేవుని ఈ శిల్పం, తెలంగాణలో గుర్తించిన వాటిలో మొదటిదని చెబుతూ చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.

More Stories
కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్ర వల్లే అన్నదాతల కన్నీరు
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు
తప్పుడు లెక్కలతో రైతులను మోసం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం