ఇటలీలో ఇద్దరు భారతీయులు గురుద్వారా సమీపంలో కాల్చివేత

ఇటలీలో ఇద్దరు భారతీయులు గురుద్వారా సమీపంలో కాల్చివేత

ఇటలీ, బెర్గామోలోని కోవోలో ఇద్దరు భారతీయులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ వద్ద జరిగింది. ఇదో వేర్‌హౌజ్. అయితే, ఇక్కడ కూడా ప్రార్థనలు నిర్వహిస్తారు. శుక్రవారం వైశాఖి ఫెస్టివల్ సందర్భంగా అందరూ ఉన్న సమయంలోనే ఈ హత్య ఘటన జరిగింది.

స్థానికులు, అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం రాగిందర్ సింగ్ (48), గుర్మిత్ సింగ్ (48) అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం రాత్రి గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా ఆయుధాలతో వచ్చిన దుండగుడు ఇద్దరిపై సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాగిందర్, గుర్మిత్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. వారిద్దరికీ ముగ్గురు చొప్పున పిల్లలు ఉన్నారు. 

అనంతరం దుండగుడు కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, హత్యకు పాల్పడింది కూడా భారతీయుడే అని ప్రాథమికంగా తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు రెండు కార్లలో అక్కడకు చేరుకోగా, వారిలో ఒక్కరు కాల్పులు జరిపాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హత్య జరిగిందని స్థానికులు అంటున్నారు. నిందితులు కూడా తరచుగా గురుద్వారాకు వచ్చేవారని  అక్కడివారు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

నిందితుడు అనేక రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన ప్రదేశం నుంచి పోలీసులు పది షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరొకరికి కూడా బుల్లెట్లు తగిలినట్లు తెలుస్తోంది. నిందితులలో ఒకరు సిక్కు కేంద్రం మాజీ అధ్యక్షుడని పోలీసులు పేర్కొన్నారు. ఆలయ నిర్వహణకు సంబంధించి ఆ వ్యక్తితో రాజిందర్ సింగ్‌కు వాగ్వాదాలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందని ‘కొరియెరే డెల్లా సెరా’ పత్రిక నివేదించింది. ఈ వారాంతంలో జరగనున్న వైశాఖి పండుగ ఏర్పాట్లలో బాధితులు పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.