అంబేద్కర్ కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు

అంబేద్కర్ కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు
అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలు ఆయనకు నివాళులర్పించారు. అంబేద్కర్‌ 135వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ముర్ము గుజరాత్‌ పర్యటన సందర్భంగా లోక్‌భవన్‌లో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌జీ కూడా అంబేద్కర్‌కు నివాళులర్పించారు. 
 
అలాగే పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణాస్థల్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
 
“భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి, గొప్ప సంఘ సంస్కర్త అయిన అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నేను నివాళి అర్పిస్తున్నాను. అంబేద్కర్‌ న్యాయ శాస్త్రవేత్త, ఆర్థికవేత్త, ప్రగాఢ ఆలోచనాపరుడు, న్యాయ పండితుడు, సమానత్వ సామాజిక వ్యవస్థకు బలమైన సమర్థుకుడు” అంటూ ముర్ము ఆయనను అభివర్ణించారు. అంబేద్కర్‌ తన జీవితాన్ని సమాజంలోని అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితం చేసి, వారి పక్షాన చారిత్రాత్మకమైన కృషి చేశారు” అని ఆమె కొనియాడారు. 
 
“ఆయన అసమానతలను తొలగించే మార్గాన్ని చూపడమే కాకుండా, భారతదేశ ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు. అంబేద్కర్‌ మహిళల విద్యకు, వారి హక్కులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చేసిన బహుముఖ సేవలు, దేశ సేవ,  అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించడానికి భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి” అని ముర్ము ఎక్స్ పోస్టులో తెలిపారు. 
 
ఈ సందర్బంగా మనం జీవితాలలో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆదర్శాలను అలవర్చుకుని, న్యాయమైన, సమ్మిళితమైన, ప్రగతిశీల దేశ నిర్మాణానికి దోహదపడతామని ప్రతిజ్ఞ చేద్దాం అని ఆమె సూచించారు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన జీవితం, కృషి, ఒక న్యాయమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి అని మోదీ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.