హామీలపై నిలదీస్తున్న ఉద్యమకారులు

హామీలపై నిలదీస్తున్న ఉద్యమకారులు

* ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయ శాంతి

ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్‌ ఆ వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమైందని సొంత పార్టీకి చెందిన నేతలే స్వయంగా ఒప్పుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నటి విజయ శాంతి శాసనమండలిలో ఉద్యమ కారుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తున్నాయి. 

శాసనమండలిలో విజయ శాంతి మాట్లాడుతూ “ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తానన్నారు. రూ.4 వేలు పెన్షన్‌, రూ.10 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా ఇంకా అనేక వాగ్ధానాలు చేశారు. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది” అని గుర్తు చేశారు. 

“కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అన్నీ జరిగిపోయాయి. చూస్తుండగానే రెండు సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు మా ఉద్యమకారులకు మా ప్రభుత్వం ఇవ్వలేదు. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. మనం ఎన్నో పధకాలను ప్రకటిస్తున్నాము. అమలు చేస్తున్నాము. మా ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చేసి ఉంటే?” అంటూ ఆమె ప్రశ్నించారు. 

“మనం కదా చెప్పాం. ఉద్యమకారులకు ఇల్లు, పెన్సన్ ఉద్యోగం, ఆరోగ్యం గురించి హెల్త్‌ ఇన్సూరెన్స్ ఇవన్నీ మనమే చెప్పాం కదా. అవన్నీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి ముందే చేసి ఉంటే గౌరవంగా ఉండెడిది” అంటూ  విజయశాంతి చెప్పారు. 

“ఇవాళ పరిస్థితి ఏమైందంటే ఉద్యమకారులడుగుతున్నారు. అయ్యా మీరు కదా మాకు హామీనిచ్చారు? ఏమైందని వాళ్లు చాలా గౌరవంగా, మర్యాదగా అడిగారు. కానీ ఎందుకు ఆలస్యమైందో నాకు తెలియదు. కమిటీ వేస్తామని చెప్పారు. నా ఉద్దేశంలో కమిటీ అనేది ఆలస్యమవుతది. ఇప్పటికే మా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పైనే అయిపోయింది. తొందరగా మనం వాళ్లకిచ్చిన వాగ్ధానం చేస్తే బాగుంటుంది” అంటూ సున్నితంగా ప్రభుత్వానికి హితవు చెప్పారు.