జీహెచ్‌ఎంసీ డివిజన్లు రెట్టింపు ప్రక్రియపై బిజెపి అభ్యంతరం

జీహెచ్‌ఎంసీ డివిజన్లు రెట్టింపు ప్రక్రియపై బిజెపి అభ్యంతరం
జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరిస్తూ, శివారు మున్సిపాలిటీలను విలీనం చేసి, ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీలిమిటేషన్ డ్రాఫ్ట్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో జరుగుతున్న డీలిమిటేషన్ ప్రక్రియను పర్యవేక్షించే భాగంగా, బీజేపీ డీలిమిటేషన్ పర్యవేక్షణ కమిటీ సభ్యులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసి ఈ ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు.

బిజెపి మాజీ ఎమ్మెల్యే డా.ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గౌతం రావు, మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి తదితరులతో  కూడిన బీజేపీ ప్రతినిధి బృందం డీలిమిటేషన్‌లో ఉన్న లోపాలు, అభ్యంతరాలపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది. జీహెచ్‌ఎంసీ అధికారులు విడుదల చేసిన 300 డివిజన్ల తుది జాబితా అనేక తప్పులతడకలతో నిండి ఉందని స్పష్టం చేశారు.

ఒక్క డివిజన్ రెండు శాసనసభ నియోజకవర్గాల్లో, రెండు రెవెన్యూ జిల్లాల్లో విస్తరించి ఉండటంలను ప్రశ్నించారు.  జనాభా ప్రామాణికమా? విస్తీర్ణం ప్రామాణికమా? ఓటర్ల సంఖ్య ప్రామాణికమా?- ఏ విధంగా డివిజన్లను ఏర్పాటు చేసారిని నిలదీశారు.  ఏ ప్రామాణికాన్ని తీసుకొని జీహెచ్‌ఎంసీలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచారో చెప్పాలని ప్రశ్నించగా అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.

ఇది జీహెచ్‌ఎంసీ స్వయంగా రూపొందించిన 300 డివిజన్ల మ్యాప్‌లా కనిపించడం లేదని, గాంధీభవన్, దారుస్సలాంలో కూర్చొని ఒక ప్రైవేట్ సర్వే ఏజెన్సీ రూపొందించిన ప్రతిపాదనలా ఉందని వారు విమర్సించారు.  డీలిమిటేషన్‌పై ప్రజల నుంచి దాదాపు 10 వేల అభ్యంతరాలు, సూచనలు వచ్చినప్పటికీ, వాటికి సమాధానం చెప్పే తీరిక కూడా జీహెచ్‌ఎంసీకి లేదని ధ్వజమెత్తారు. 

 
అక్కడక్కడ కేవలం పేర్లు మాత్రమే మార్చారు తప్ప, సహజ భౌగోళిక స్వరూపం, జనాభా సమతుల్యత, ఓటర్ల ప్రామాణికం వంటి కీలక అంశాల్లో ఎక్కడా దిద్దుబాటు జరగలేదని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ప్రజలను అడ్డుపెట్టుకుని, విస్తీర్ణాన్ని కారణంగా చూపుతూ వేల కోట్ల రూపాయల విదేశీ రుణాలు తెచ్చుకోవాలనే లక్ష్యంతోనే ఈ పరిధి విస్తరణ జరిగిందని ఆరోపించారు.

ఇది సాధారణ, సామాన్య పౌరులకు మెరుగైన పరిపాలన అందించేందుకు కాదు; కేవలం దారుస్సలాం-గాంధీభవన్ చేతుల్లో జీహెచ్‌ఎంసీని అప్పగించేందుకు రూపొందించిన ప్రక్రియలా కనిపిస్తోంది తప్ప, ప్రజాప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయంగా కనిపించడం లేదు. ఈ ప్రజావ్యతిరేక, అవ్యవస్థిత డీలిమిటేషన్ ప్రక్రియపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించి, ప్రజల్లోకి వెళ్లి ఉద్యమిస్తామని బిజెపి నాయకులు స్పష్టం చేశారు. దారుస్సలాం-గాంధీభవన్ నిరంకుశ పరిపాలన తీరును ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించారు.