భారత్‌ – ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్‌ – ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

* మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం

గల్ఫ్ దేశాలతో తన ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భారత్‌ – ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో భారత్, ఒమన్ ప్రతినిధులు గురువారం మస్కట్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 

ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు స్థిరంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ ఒప్పందం జరిగింది. భారత్, ఒమన్ మధ్య 2024 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 8.947 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 10.613 బిలియన్ డాలర్లకు పెరిగింది. అదే సమయంలో ఒమన్‌ లో 6,000 కంటే ఎక్కువ భారత్-ఒమన్ సంయుక్త సంస్థలు పనిచేస్తుండటంతో పెట్టుబడి సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. 

ప్రస్తుతం 80 శాతానికి పైగా భారతీయ వస్తువులు సగటున 5 శాతం సుంకంతో ఒమన్‌ కు ఎగుమతి అవుతున్నాయి. అయితే కొన్ని రకాల మాంసాలు, మద్యం, పొగాకు వంటి ఎంపిక చేసిన ఉత్పత్తులపై సుంకాలు సున్నా నుంచి 100 శాతం వరకు ఉన్నాయి. ఈ ఒప్పందాన్ని ద్వైపాక్షిక సంబంధాలలో ఒక మైలురాయిగా భారత్ అభివర్ణించింది.

 “రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, అభివృద్ధి చెందుతున్న రంగాలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక విస్తృత అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ తారిక్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా చర్చించారు” అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌ లో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌’ ప్రదానం చేశారు. ఇది ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌’ పురస్కారంలో మోదీని ఒమన్ ప్రభుత్వం సత్కరించింది.

భారత్, ఒమన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త విశ్వాసం, దిశ, శక్తిని ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ డీల్ రెండు దేశాల ఉమ్మడి భవిష్యత్తుకు బ్లూప్రింట్ లాంటిదని పేర్కొన్నారు.  ఈ ఒప్పందం భారత్- ఒమన్ల వాణిజ్యాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు కొత్త విశ్వాసాన్ని ఇస్తుందని, ప్రతి రంగంలో అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇండియా-ఒమన్ వ్యాపార సదస్సులో మోదీ వ్యాఖ్యానించారు.
 
“ఈ ఒప్పందం యావత్ ప్రపంచానికి ప్రయోజనకరం. ఒమన్‌ కు మరింత ప్రయోజనకరం. ఎందుకంటే భారత్, ఒమన్ మంచి మిత్రదేశాలు. ఇరుదేశాల ప్రజలు ఒకరికొకరు బాగా తెలుసు. రెండు దేశాల వ్యాపార సంబంధాలపై తరతరాలుగా నమ్మకం ఉంది. మేము ఒకరి మార్కెట్‌ లను ఒకరం బాగా అర్థం చేసుకున్నాం. వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి శిఖరాగ్ర సమావేశం నుంచి వచ్చిన ఊపును ఉపయోగించుకోవాలని రెండు దేశాల వ్యాపారస్తులను సూచిస్తున్నాను” అని ప్రధాని మోదీ తెలిపారు.