వచ్చే 50 ఏళ్లకు ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

వచ్చే 50 ఏళ్లకు ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.  అధికారులతో ఈవో సమీక్ష నిర్వహిస్తూ వచ్చే 50 సంవత్సరాల నాటికి భక్తులు రోజుకు ఎంత మంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా  మౌళిక సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మికత,  మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. 

భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామ స్వామి ప్రాశస్థ్యం నవతరానికి అందించేలా మ్యూజియమ్, ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవా నిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహాం, నాలుగు మాడ వీధుల అభివృద్ధి, సిసి కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు.

మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో టిటిడి విజిలెన్స్, అటవీశాఖ, అన్నదానం, గార్డెనింగ్, ఎలక్ట్రికల్ తదితర  శాఖల అధికారులను భాగస్వామ్యం చేసి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాలని ఇంజనీరింగ్ ఆదేశించారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆప్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డా. అనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.