పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. విజయవాడ రైల్వే డిఆర్‌ఎం మోహిత్‌ సోనాకియాతో ఆయన శుక్రవారం భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టుల్లో పెండింగ్‌ పనులు పురోగతిపై డిఆర్‌ఎంతో పాటు రైల్వే ఉన్నతాధికారులతో సమీక్షించారు. 
గోదావరి జిల్లాల్లో కీలకమైన నరసాపురం -కోటిపల్లి రైల్వే లైన్‌ పనులు ఆలస్యం ఎందుకవుతుంది? కారణాలేమిటీ? అనే విషయాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.  నరసాపురం – మచిలీపట్నం రైల్వే లైన్‌ పనులు ప్రస్తుతం ఏదశలో ఉన్నాయి? నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్లలో అమృత్‌ స్టేషన్‌ పథకం కింద జరుగుతున్న పనుల పురోగతిపైన కూడా కేంద్ర సహాయ మంత్రి చర్చించారు.
 
రైల్వే స్టేషన్లలో ఆధునిక సదుపాయాల కల్పన కోసం అదనపు నిధులు మంజూరుకు తాను చేసిన ప్రతిపాదనలు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు వివిధ ఎక్స్‌ప్రెస్‌రైళ్లకు తాడేపల్లి గూడెంలో హాల్ట్‌ కల్పించాల్సిన ఆవశ్యకతను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని మంత్రి సూచించారు. అత్తిలి స్టేషన్‌లో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ సదుపాయం కల్పించాలనికోరారు. 
 
నరసాపురం నుంచి అరుణాచలం ఎక్స్‌ప్రెస్‌ పూర్తి స్థాయిలో రెగ్యులర్‌ చేయడం, నరసాపురం నుంచి వారణాశికి ఎక్స్‌ ప్రెస్‌రైలు కల్పించాలని తమ పార్లమెంట్‌ ప్రజలతో పాటు కోనసీమ వాసుల చిరకాల కోరిక అని మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.  ఈ భేటీలో అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజరు పిఇ ఎడ్విన్‌, గతిశక్తి చీఫ్‌ ప్రాజెక్టు మేనేజరు సైమన్‌, సీనియర్‌డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజరు ప్రశాంత్‌కుమార్‌,సీనియర్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ సూర్యప్రకాష్‌, సీనియర్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరు పి.సురేష్‌బాబు, రైల్వే ఉన్నతాధికారులతో పాటు బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ బాజీ పాల్గన్నారు.