
పాకిస్థాన్ – అఫ్గానిస్థాన్ బలగాల మధ్య జరిగిన ఘర్షణలో పాక్ సైనికులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఖైబర్-పఖ్తుంక్వా, బలూచిస్థాన్ సరిహద్దుల్లో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించినట్టు అఫ్గానిస్థాన్ అధికారులు తెలిపారు. 25 పాక్ ఆర్మీ పోస్ట్లను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
అలాగే పాకిస్థాన్ చేసిన దాడికి సమాధానం ఇవ్వకుండా వదిలపెట్టబోమని హెచ్చరించారు. మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో అఫ్గానిస్థాన్ సరిహద్దును మూసివేసినట్లు పాకిస్థాన్ అధికారులు తెలిపారు. “పాకిస్థాన్ తన నేలపై ఐసిస్ ఉనికిని చూసీ చూడనట్లు ప్రవర్తించింది. అఫ్గాన్కు తన గగనతల, భూసరిహద్దులను రక్షించుకునే హక్కు ఉంది. ఏ దాడినీ మౌనంగా వదిలిపెట్టదు” అని హెచ్చరించింది.
“పాకిస్థాన్ తమ భూభాగంలో దాక్కున్న ఐసిస్ కీలక సభ్యులను బయటకు పంపాలి లేదా ఇస్లామిక్ ఎమిరేట్ అధికారుల చేతికి అప్పగించాలి. ఐసిస్ ప్రపంచంలోని అనేక దేశాలకు, ముఖ్యంగా అఫ్గాన్కు, తీవ్రమైన ముప్పుగా ఉంది. ఇస్లామిక్ ఎమిరేట్ తమ భూభాగంలో కల్లోలం సృష్టిస్తున్నవారిని తొలగించింది” అని తెలిపారు.
“అయితే, ఆ గుంపులు పఖ్తుంక్వాలో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేశాయి. కరాచీ, ఇస్లామాబాద్ విమానాశ్రయాల ద్వారా కొత్తగా చేరిన నియామకులను ఈ శిక్షణా కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. అఫ్గాన్పై జరిగే దాడులు కూడా ఈ కేంద్రాల నుంచే ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. దీని గురించి సాక్ష్యాలు కూడా మాకు దగ్గర ఉన్నాయి. ఈ ఘర్షణల్లో ఇస్లామిక్ ఎమిరేట్ బలగాల చేతికి పాకిస్తాన్ ఆయుధాల గణనీయమైన నిల్వలు దొరికాయి. మా భూభాగంపై దాడి చేసినా లేదా తమ గగనతలాన్ని ఉల్లంఘించినా కఠినమైన ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ముజాహిద్ తెలిపారు.
శనివారం రాత్రి పాక్ సరిహద్దుల వెంట తాలిబన్ బలగాలు కాల్పులు జరిపాయి. అనంతరం అఫ్గాన్ సరిహద్దులు లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది. గురువారం అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి ) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపించారు.
అయితే, ఈ దాడులకు ప్రతీకారంగానే ప్రస్తుతం తాలిబన్ దళాలు సరిహద్దుల వెంబడి దాడులు చేపట్టినట్లు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. పాక్ బలగాలు నిబంధనలను ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు దాడులను మరింత ఉధృతం చేస్తాయని హెచ్చరించారు.
More Stories
`గాజా శాంతి ఒప్పందం’కు మోదీకి ట్రంప్ ఆహ్వానం?
ఆఫ్ఘన్ సరిహద్దులో 12 మంది పాక్ సైనికుల మృతి
భారత్, అఫ్గాన్ ఉమ్మడి ప్రకటనపై పాక్ అక్కసు