
గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని, అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు.
అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. 2027లో జులై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి.
ఇప్పటి నుంచి దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆలయ పరిసరాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధిని మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని చెప్పారు. ఆలయ అభివృద్ధితో పాటు అక్కడ శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సందర్శించి, అక్కడ అవసరమైన అభివృద్ధి పనుల జాబితాను తయారు చేయాలని చెప్పారు. మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు గోదావరి తీరం వెంట ఉన్న అన్ని ఆలయాలన్నింటినీ సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్ ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలని వివరించారు.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
తెలంగాణలో 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు