హైదరాబాద్ లోనే ఐదేళ్లలో 23 శాతం పెరిగిన పెట్రోల్ ధరలు

హైదరాబాద్ లోనే ఐదేళ్లలో 23 శాతం పెరిగిన పెట్రోల్ ధరలు
దేశంలో ఏ నగరంలో లేని విధంగా మన హైదరాబాద్ నగరంలోనే పెట్రోల్ ధరలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో 23 శాతానికి పైగా పెరగాయి. దేశంలోని ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే 10 శాతం అదనంగా పెరగడం గమనార్హం. తెలంగాణలో పెట్రోల్ రేట్లు దేశంలోనే అత్యధికంగా ఉన్నట్లు నిరుప సత్య శ్రీ వత్యమ్ నివేదిక తెలిపింది.

లోక్‌సభలో ప్రవేశపెట్టిన డేటా ప్రకారం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 2021లో లీటరుకు రూ. 87.06 వద్ద ఉంది. అయితే, అది ఇప్పుడు రూ.107.46 వద్దకు చేరుకుంది. దేశంలోని పెద్ద నగరాల్లో కేవలం ఒక కోల్‌కతాలో మాత్రమే ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే పెట్రోల్ ధరల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. దానికంటే ముందు పుణె రూ.109.74, జలంధర్ రూ.107.48 వద్ద రేట్లు ఉన్నాయి.

 
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా దేశంలో పెట్రోల్ ధరలు తగ్గినట్టు కేంద్ర పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. 2021 నవంబర్‌లో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర రూ.110.04 వద్ద ఉండగా, అది రూ.94.77కు తగ్గినట్లు చెప్పారు. అలాగే లీటర్ డీజిల్ ధర రూ.98.42 వద్ద ఉండగా అది రూ.87.67 స్థాయికి దిగివచ్చినట్లు పేర్కొన్నారు. 
 
ఇందుకు ప్రధాన కారణం కేంద్రం రెండు సార్లు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం. పెట్రోల్ లీటరుపై రూ.13, డీజిల్‌పై రూ.16 చొప్పున తగ్గించింది.  అయితే, తెలంగాణ వాహనదారులకు ఈ ప్రయోజనం అందలేదని చెప్పాలి. అందకు ప్రధాన కారణం రాష్ట్రం విధిస్తున్న పన్నులేనని రాష్ట్రంలోని ఫ్యూయల్ డీలర్స్ పేర్కొంటున్నారు. 
 
కొన్ని రాష్ట్రాలు వాల్యూ ఆడెడ్ ట్యాక్స్ (వ్యాట్) తగ్గించగా తెలంగాణలో మాత్రం తగ్గలేదు. దీంతో ఇక్కడ పెట్రోల్ ధరలు భారీగా ఉన్నాయి. అత్యధిక వ్యాట్ పన్నులు ఉండడం వల్ల దేశీయ సగటు ధరల కంటే తెలంగాణలోనే ధరలు ఎక్కువగా ఉన్నట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ చెబుతోంది. వ్యాట్ తగ్గించినట్లయితే పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తాయని చెబుతున్నాయి.