
వందే భారత్కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో సికింద్రాబాద్ – తిరుపతి సహా 7 మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్ల కోచ్ల సంఖ్యను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సికింద్రాబాద్- తిరుపతి, మంగళూరు సెంట్రల్- తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్-తిరునల్వేలి, మదురై-బెంగళూరు కంటోన్మెంట్, దేవ్గఢ్-వారణాసి, హవ్డా-రౌర్కెలా, ఇందౌర్-నాగ్పుర్ మధ్య నడిచే వందే భారత్ రైళ్లలో మరికొన్ని కోచ్లు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రస్తుతం ఈ 3 మార్గాల్లో 16 కోచ్లు, 4 రూట్లలో 8 కోచ్ల వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. 16 కోచ్ల రైలును 20 కోచ్లతో, 8 కోచ్ల రైళ్ల స్థానంలో 16 కోచ్లకు అప్గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (జులై 31, 2025 నాటికి) వందేభారత్ రైళ్ల రద్దీ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని వీటిని అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.
సికింద్రాబాద్- తిరుపతి సహా మంగళూరు సెంట్రల్- తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్-తిరునల్వేలి మార్గాల్లో ప్రస్తుతం 16 కోచ్ల వందేభారత్ నడుస్తుండగా దీనిని 20 కోచ్లకు పెంచనున్నారు. మిగతా 4 మార్గాల్లో 8 కోచ్ల రైళ్లు నడుస్తుండగా వాటి స్థానంలో 16 కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ 7 మార్గాల్లో కోచ్ల అప్గ్రేడ్తోపాటు మరిన్ని 20 కోచ్ల వందేభారత్ రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
కొత్తగా వచ్చే 16, 8 కోచ్ల రైళ్లను కొత్త మార్గాల్లో ఉపయోగిస్తామని దిలిప్ కుమార్ వివరించారు. అలానే దక్షిణ మధ్య రైల్వే ఇటీవల సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ప్రెస్లో కోచ్ల సంఖ్యను పెంచింది. ఈ రైళ్ల (20720,20708)లో ప్రస్తుతం 14 ఏసీ ఛైర్ కార్ కోచ్లు ఉండగా వాటి సంఖ్య 18కి పెంచారు. రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ల సంఖ్యలో ఎటువంటి మార్పు చేయలేదు. సికింద్రాబాద్-విశాఖపట్నం (20707) వందేభారత్ రైలు ఉదయం 5.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2.30కి బయలుదేరే రైలు (20708) రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది.
More Stories
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల