కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా

కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా

యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియా ఉరిశిక్ష వాయిదా పడింది. వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో నిమిషాకు భారత కాలమానం ప్రకారం యెమెన్‌ సనా జైలులో రేపు మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో  భారత్ కు చెందిన మతపెద్దలు బాధిత కుటుంబంతో చర్చలు జరిపిన నేపథ్యంలోనే నిమిషా ఉరిశిక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది.  

నిమిషా ఉరిశిక్ష వాయిదా పడిన విషయాన్ని  యెమెన్‌లో ‘‘సేవ్‌ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ కౌన్సిల్‌’’ సభ్యుడు శ్యామూల్‌ జోరెమ్‌ భాస్కరన్‌ ధృవీకరించారు.  అయితే.. బాధిత కుటుంబం బ్లడ్‌మనీ (పరిహారం సొమ్ము)కుగానీ, శిక్షరద్దుకుగానీ అంగకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని ఆయన తెలిపారు. 

ఇక నిమిషా శిక్ష రద్దు కోసం కేరళ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని.. ఆమె ప్రాణాలను కాపాడాలని తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. మరోవైపు కేరళకు చెందిన ఇండియా గ్రాండ్‌ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్‌ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు యెమెన్ లో తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు.   

శిక్ష రద్దు కోసం  త లాల్ అబ్దో మహ్దీ కుటుంబంతో మతపెద్దలు ఉత్తర యెమెన్‌లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడడం గమనార్హం. మరోవైపు, భారత విదేశాంగశాఖ అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.  ఈ  కేసులో ఇప్పటివరకు  నిమిషా తల్లి ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నాక్షమాభిక్షపైగానీ, బ్లడ్‌మనీపైగానీ చర్చించేందుకు  తలాల్‌ కుటుంబం ఇంతకాలం ముందుకు రాలేదు. అయితే   కేరళ మత గురువుల జోక్యంతో.. ఉరిశిక్ష అమలు కాబోయే ముందు రోజు తలాల్‌  సోదరుడు, ఇతర కుటుంబ సభ్యలు మొదటిసారి భేటిలో పాల్గొన్నట్లు తెలుస్తుంది.