
బిసిలకు42% రిజర్వేషన్లను అమలు చేయాలని, ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టం 2018లో తీసుకొచ్చిన చట్టాన్ని త్వరలోనే సవరించాలని, దీంతోపాటు ఆర్డినెన్స్ ద్వారా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో గురువారం సమావేశమైన కేబినెట్ తీ ర్మానించింది.
దీంతోపాటు ఆధునిక గోశాలలను నిర్మించాలని, రెండు విద్యాసంస్థలను యూనివర్శిటీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్లు సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు.
కేబినెట్ సమావేశంలో అడ్వకేట్ జనరల్ సలహా లు, సూచనలు తీసుకొని భవిష్యత్లో చిక్కులు రాకుండా, బిసిలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేసి స్థానిక సంస్థలకు పోవాలని కేబినెట్లో నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తశుద్దితో న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని, ఇచ్చిన మాట ప్రకారం 42శాతం బిసి సోదరులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా, జనాభా ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించిందని పేర్కొన్నారు. బిసిల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్ ఎన్నికలకు, ఎంపిటిసి ఎన్నికలకు మండలం యూనిట్ గా, ఎంపిపి, జడ్పీటిసి ఎన్నికలకు జిల్లా యూనిట్ గా, జడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా పరిగణించనున్నట్టు వారు తెలిపారు.
దేశవ్యాప్తంగా పేరున్న అమిటీ విద్యాసంస్థ, సెంటినరీ రిహాబిటేషన్ విద్యాసంస్థలను యూనివర్శిటీలుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదించిందని వారు పేర్కొన్నారు. ఎయిమిటీ విద్యాసంస్థలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 50శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనను విధించామని మంత్రులు తెలిపారు.
రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. వచ్చే కేబినేట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని ఈ కమిటీకి గడువు నిర్ణయించిందని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 306 గోశాలలు ఉన్నాయని, ఆ గోశాలల్లో స్థలం తక్కువగా ఉందని, గోవులు ఎక్కువగా ఉన్నాయని వాటికి సరైన సౌకర్యాలు లేవని ఈ నేపథ్యంలోనే ఆధునిక గోశాలలను నిర్మించాలని నిర్ణయించామని, వాటికోసం స్థల సేకరణ చేయాలని కేబినెట్లో నిర్ణయించామని మంత్రులు తెలిపారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించినట్టు మంత్రులు పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో ఆధునిక గోశాలలు నిర్మించాలని నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.
మార్చిలోపు లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రులు తెలిపారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రతి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని వారు తెలిపారు
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు