
తిరుమల- తిరుమల కొండపై పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇకపై ఎక్కువగా పొగ వచ్చే వాహనాలను తిరుమలకు అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. ప్రతి రోజు సుమారు 8 వేల ప్రైవేటు కార్లు తిరుమలకు వస్తుండడంతో కొండపై కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. తిరుమలకు వెళ్లే మార్గంలో అలిపిరిలో చెకింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
ఇక్కడ ర్యాండమ్ తనిఖీలు చేస్తూ, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనివాహనాలపై దృష్టిసారిస్తున్నారు. స్మోక్ మీటర్ ద్వారా వాహన ఉద్గారాలను పరిశీలించి, వాటి స్థాయి 4.0 యూనిట్లకు మించి ఉంటే వెంటనే వెనక్కు పంపిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తులు, తమ వాహనాల పొల్యూషన్ స్టేటస్ను ముందుగానే పరిశీలించుకోవాలి.
సర్టిఫికెట్ లేకపోవడం లేదా ఉద్గారాలు అధికంగా విడుదల కావడం వల్ల తిరుమలకు వెళ్లే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కొండపై కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే వడలు అందించగా, ఇప్పుడు రాత్రి భోజన సమయంలో కూడా వడ్డించనున్నారు. వడల పంపిణీలో జాప్యం లేకుండా అందించేందుకు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇప్పటివరకు అన్నప్రసాదంలో పచ్చడి, స్వీట్, అన్నం, పప్పు, కూర, సాంబార్, రసం, మజ్జిగ పులుసు మాత్రమే ఉండేవి. ఇకపై వీటితో పాటు వడ కూడా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు వడలను వడ్డించనున్నారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ