ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతా దళాలు

ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతా దళాలు
పూంచ్‌ సురాన్‌కోట్‌ తహసీల్‌ దార్‌ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ రహస్య స్థావరం నుంచి మూడు హ్యాండ్ గ్రెనేడ్‌లు, బుల్లెట్లు, ఛార్జ్ లీడ్, ఇనుప రాడ్, వైర్ కట్టర్, కత్తి, పెన్సిల్ సెల్, లైటర్ సహా ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. 
ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఉగ్రవాదుల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించిన అనంతరం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.  ఇదిలా ఉండగ, ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఇటీవల ఉధంపూర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంసత్‌గఢ్‌లో పారిపోయిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.
ఈ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం, సహజంగా ఏర్పడిన గుహలు ఉండడంతో ఉగ్రవాదులు ఇక్కడే దాక్కొని ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. దాంతో ఉగ్రవాదుల ఏరివేత భద్రతా బలగాలకు సవాల్‌గా మారుతున్నది. ఇప్పటి వరకు ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారు సైతం చిక్కలేదు. పగటిపూటే ఆపరేషన్‌ ముగించేందుకు ప్రయత్నలు జరగాలని మాజీ డీజీపీ ఎస్పీ వైద్‌ పేర్కొన్నారు. కశ్మీర్‌, జమ్మూ డివిజన్‌కు మధ్య తేడా ఉంటుందని తెలిపారు.

 కశ్మీర్‌లో మైదానాల్లో దాక్కునే ఉగ్రవాదులు తప్పించుకోలేరని, రాత్రిపూట వెలుతురులో వారిని ముట్టడించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే, జమ్మూ డివిజన్‌లోని కథువా, ఉధంపూర్‌, దోడా, కిష్త్వార్, రాంబన్, రాజోరి, పూంచ్ ప్రాంతాలలో దట్టమైన అడవులున్నాయని తెలిపారు.