
దేశ వైద్య విద్య రంగంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, అనేక అక్రమాలు తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయని సిబిఐ పేర్కొంది. ఈ కుంభకోణంతో సంబంధమున్న పలువురు సీనియర్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనధికారికంగా రహస్య సమాచారాన్ని పంచుకోవడం, చట్టబద్ధమైన తనిఖీ ప్రక్రియలను తారుమారు చేయడం, తమకిష్టమైన ప్రైవేటు సంస్థలకు అనకూలంగా పనులు జరిగేలా చూసేందుకు విచ్చలవిడిగా ముడుపులు అందచేయడం వంటివి ఈ కుంభకోణంలో చోటు చేసుకున్నాయని సిబిఐ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ అవినీతి కుంభకోణం చాలా లోతైన నేరపూరితమైన కుట్రతో కూడినదని తెలిపారు. ఇందులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎఫ్డబ్ల్యు) సీనియర్ అధికారులు, జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి), దేశవ్యాప్తంగా పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రతినిధులు, యుజిసి మాజీ చైర్మన్లకు సంబంధముందని చెప్పారు.
అవినీతి నిరోధక చట్టంలోని 7,8,9,10,12 సెక్షన్ల కింద, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 61(2) కింద సిబిఐ కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా డజన్ల సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, పారిశ్రామిక అధిపతులు ఈ దర్యాప్తులో చిక్కుకున్నారు. ముడుపుల నుండి క్రిమినల్ కుట్ర వరకు అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం, ఫోర్జరీ సంతకాలు ఇలా పలు అభియోగాలు వారిపై నమోదయ్యాయి.
న్యూఢిల్లీలో కొంతమంది ప్రభుత్వ అధికారుల బృందం మెడికల్ కాలేజీలకు సంబంధించిన తనిఖీలు, గుర్తింపు, పునరుద్ధరణ ప్రక్రియలకు సంబంధించిన విశ్వసనీయమైన, రహస్యమైన ఫైళ్ళను చట్టవిరుద్ధంగా అందుబాటులోకి తీసుకరావడానికి వెసులుబాటు కల్పించిందని సీబీఐ వెల్లడించింది. ఈ బృందంలో ఎన్ఎంసి, ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు చెందిన వారు వున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైన వారిలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిఐఎస్ఎస్) ఛాన్సలర్ డి.పి.సింగ్ వున్నారు.
ఈయన గతంలో యుజిసి చైర్మన్గా కూడా పనిచేశారు. కాలేజీల ఇనస్పెక్షన్ షెడ్యూళ్ళ వివరాలు, తనిఖీలకు వచ్చే వారి సమాచారం అంతా రహస్యంగా వుంచాలి. కానీ ఈ బృందం ముందుగానే కాలేజీ ప్రతినిధులకు వెల్లడించేవారు. దీంతో ఆయా వైద్య సంస్థలు అధికారిక ఇనస్పెక్షన్లల సందర్భంగా మోసపూరిత చర్యలకు పాల్పడేందుకు వీలు ఉండేది. అంటే కాలేజీల్లో ఘోస్ట్ ఫ్యాకల్టీని మోహరించడం, బూటకపు రోగులను అడ్మిట్ చేసుకోవడం, బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థలో అవకతవకలకు పాల్పడడం, తమ సంస్థలకు అనుకూంగా నివేదికలు ఇచ్చేలా తనిఖీలు చేసే బృందాలకు ముడుపులు ఇవ్వడం వంటివి జరిగేవని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే మధ్యవర్తులకు వారి వ్యక్తిగత మొబైల్స్కు పలు మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గతంగా నడిచే ఫైళ్ళను ఫోటోలు తీసి పంపేవారు. రహస్య సమాచారంతో పాటు సీనియర్ అధికారుల వ్యాఖ్యలు కూడా చేరవేసేవారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులే ఇందుకు పాల్పడేవారు.
హవాలా మార్గాల ద్వారా ముడుపులు
ఇలా లీకైన డేటాను అందుకున్న వారిలో గుర్గావ్కు చెందిన వీరేంద్ర కుమార్, న్యూఢిల్లీకి చెందిన మనీషా జోషి, ఇంకా ఇండోర్లోని ఇండెక్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ సురేష్ సింగ్ బడోరియా, ఉదరుపూర్లోని గీతాంజలి యూనివర్శిటీ రిజిస్ట్రార్ మయూర్ రావల్ ఇలా పలువురు వున్నారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఆ సమయంలో మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఎఆర్బి)కి పూర్తి స్థాయి సభ్యుడిగా వున్న జితూ లాల్ మీనాతో వీరేంద్ర కుమార్కు సంబంధాలుండేవని దర్యాప్తులో వెల్లడైంది.
పైగా హవాలా మార్గాల ద్వారా ముడుపులను వసూలు చేయడంలో మధ్యవర్తిగా కూడా వుండేవారు. వివిధ కాలేజీ అడ్మినిస్ట్రేటర్ల నుండి కుమార్కు నిధులు బదిలీ అయ్యేవి. ఆతర్వాత వాటిని మీనాకు అందచేసేవారు. ఇలా అక్రమంగా అందిన నిధుల్లో కొంత మొత్తాన్ని తీసి రాజస్థాన్లో హనుమాన్ ఆలయం నిర్మించడానికి కూడా మీనా వాడారని అధికారులు తెలిపారు. ఆ ఆలయ ఖర్చే రూ.75లక్షలు.
ఇండోర్లోని ఇండెక్స్ మెడికల్ కాలేజీలో ఎన్ఎంసి కనీసప్రమాణాలను అందుకోవడం కోసం ఘోస్ట్ ఫ్యాకల్టీని శాశ్వత ఉద్యోగిగా చూపించారు. పూర్తి స్థాయి ఫ్యాకల్టీ హాజరవుతోందని చెప్పడానికి గానూ క్లోనింగ్ చేసిన వేలి ముద్రలను ఉపయోగించి బయో మెట్రిక్ వ్యవస్థను కూడా తారుమారు చేశారు.
అలాగే కాలేజీ చైర్మన్ సురేష్ సింగ్ బడోరియా మాల్వాంచల్ యూనివర్శిటీ (ఇండెక్స్ మెడికల్ కాలేజీ మాతృ సంస్థ) ద్వారా బూటకపు డిగ్రీ సర్టిఫికెట్లు, ఎక్సీపీరియన్స్ సర్టిఫికెట్లు జారీ చేశారు. రారుపూర్లోని శ్రీ రావత్పురా సర్కార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్రీసెర్చ్ (ఎస్ఆర్ఐఎంఎస్ఆర్)లో ఇటీవలే అంటే జూన్ 30న ఇనస్పెక్సన్ జరిగింది. దానికి వచ్చే నలుగురు సభ్యుల ఎన్ఎంసి బృంద వివరాలను తెలసుకోవడానికి రూ.25 నుండి రూ.30లక్షల వరకు ముడుపులు అందచేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనూ అక్రమార్కులు
వీరేంద్ర కుమార్ కార్యకలాపాలు దక్షిణ భాతదేశానికీ విస్తరించాయని ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కదిరికి చెందిన తన అసోసియేట్ బి.హరిప్రసాద్, ఆయన భాగస్వాములు అంకం రాంబాబు (హైదరాబాద్), కృష్ణ కిషోర్ (విశాఖపట్నం)లతో కలిసి డమ్మీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడం, ముడుపులు తీసుకుని రెగ్యులేటరీ అప్రూవల్స్ జారీ చేయడం వంటి పనులు వీరేంద్ర కుమార్ చేసిపెట్టేవారు.
గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ నుండి రూ.50లక్షలను కృష్ణకుమార్ వసూలు చేసి కుమార్కు పంపాడు. వరంగల్లోని ఫాదర్ కొలంబో ఇనిస్టిట్యూట్ఆఫ్ మెడికల్సైన్సెస్ వంటి సంస్థలూ ఈ నెట్వర్క్లో భాగమే. ఈ సంస్థ నుండి రూ.4కోట్లకు పైగా మొత్తాలు హరిప్రసాద్కు చెల్లించి, ఎన్ఎంసి నుండి తమకు అనుకూలంగా నివేదిక వచ్చేలా చూసుకున్నారు. మధ్యవర్తుల ద్వారా ఈ ముడుపుల చెల్లింపులు జరిగేవి.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్