రామాయణం కేవలం కథ కాదు.. మన సంస్కృతి

రామాయణం కేవలం కథ కాదు.. మన సంస్కృతి
బాలీవుడ్ న‌టుడు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణం. ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను గురువారం విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ రామాయణం కేవలం ఒక కథ కాదని, అది మన సంస్కృతికి, మన సత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని ద‌గ్గ‌ర చేసే క‌థ‌ అని చెప్పారు. 
 
“రామాయణంతో, మేము చరిత్రను తిరిగి చెప్పడం మాత్రమే కాదు; మేము మా వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాము. మనం ఇంతకు ముందు తీసిన చాలా రామాయ‌ణం సినిమాల‌ను చూశాం. కానీ ఈ వెర్షన్ వాటి కంటే భిన్నంగా ఉండ‌బోతుంది” అని న‌మిత్ చెప్పుకొచ్చారు.  ‘రామాయణం’ చిత్రం “ది ఇంట్రడక్షన్” పేరుతో ఒక గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. 
 
ఈ వీడియో రామాయణంలోని కొన్ని ముఖ్య సన్నివేశాలు, విజువల్స్, రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ లుక్స్‌ను చూపించింది. “ముల్లోకాలను త్రిమూర్తులు పరిపాలిస్తున్నారు. బ్రహ్మ- సృష్టించే దేవుడు; విష్ణువు- రక్షించే దేవుడు; శివుడు- అంతం చేయగలిగే దేవుడు. కానీ, వారు సృష్టించిన మూడు లోకాలపై ఆధిపత్యం కోసం ఎదురు తిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే రణం ప్రారంభమైంది” అంటూ వీడియో గ్లింప్స్‌ ఉంది
 
5000 సంవత్సరాల నుంచి 250 కోట్ల మంది ప్రజలు ఆరాధించేది. ఇది ఒక అమరమైన రామ vs రావణ ఇతిహాసగాథ. ‘రామాయణం’ మన వాస్తవం మన చరిత్ర అంటూ వివరించారు.  ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్, సౌండ్ డిజైన్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటున్నాయి. 
 
నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ ‘రాముడు’, యశ్ ‘రావణ’, సాయి పల్లవి ‘సీత’, రవి దుబే ‘లక్మణ’, సన్నీ దేఓల్‌ ‘హనుమాన్’గా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.