స్వర్ణాంధ్ర-2047 వికసిత్‌ భారత్​లో అంతర్భాగమే

స్వర్ణాంధ్ర-2047 వికసిత్‌ భారత్​లో అంతర్భాగమే
స్వర్ణాంధ్ర-2047 అనేది సమగ్ర దార్శనిక పత్రమని, దేశం నిర్దేశించుకున్న వికసిత్‌ భారత్‌లో అంతర్భాగమే అని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు. ఏపీని 2047 నాటికి దేశంలో టాప్‌ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.  మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో 6, 7, 8వ స్నాతకోత్సవంలో పాల్గొంటూ విద్యార్థులు దేశ భవిష్యత్‌ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు అయ్యే నాటికి ఏపీని సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని చెప్పారు.  “దేశం నిర్దేశించుకున్న వికసిత్‌ భారత్‌లో అంతర్భాగమే ఇది. 2047 నాటికి ఏపీని జీడీపీ, పెట్టుబడులు, నాణ్యమైన జీవితాన్ని అందించడం వంటి విషయాల్లో దేశంలోనే మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భావిభారత పౌరులంతా ఈ లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని గవర్నర్ తెలిపారు.

దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఓడ రేవు నగరాల్లో మచిలీపట్నం ఒకటని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఉద్యమాలకు పుట్టినిల్లుగా అభివర్ణించారు. ఎంతో మంది గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులను కృష్ణా జిల్లా అందించిందని గుర్తుచేశారు. పీజీలు, డిగ్రీలు పొందడంతో నేర్చుకోవడం ఆపకూడదన్న లోకేశ్‌ సమాజాన్ని తీర్చిదిద్దే అధ్యాపకులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు.

తొలుత ప్రాంగణంలోని ఫుడ్‌ కోర్టును మంత్రులతో కలిసి గవర్నర్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురికి డాక్టరేట్‌లు ప్రదానం చేశారు. పలు కోర్సుల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు వాటిని ప్రదానం చేసి అభినందనలు తెలిపారు.