ఇక కిరాణా దుకాణాల్లోనూ కేవైసీ అప్‌డేట్‌

ఇక కిరాణా దుకాణాల్లోనూ కేవైసీ అప్‌డేట్‌
బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీని (నో యువర్‌ కస్టమర్‌) అప్‌డేట్‌ చేసుకునే విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అనూహ్య చర్యలు చేపట్టింది. కేవైసీని అప్‌డేట్‌ చేసుకునేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఆర్‌బీఐ వినూత్న నిర్ణయం తీసుకుంది. 
 
కేవైసీ అప్‌డేట్‌కు సంబంధించిన రెండు ప్రక్రియలలో ముఖ్యమైన మార్పులను తీసుకువస్తూ ఈనెల 12న(గురువారం) ఆర్‌బీఐ ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొదటగా, మీ ఇంటి సమీపంలోని కిరాణా దుకాణదారులు లేదా ఎన్‌జీఓ, స్వయం సహాయక గ్రూపులు(ఎస్‌హెచ్‌జీ), సూక్ష్మ ఆర్థిక సంస్థలు (ఎంఎఫ్‌ఐ) వంటి బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లుగా పిలిచే బ్యాంకు ఏజెంట్ల వద్దనే ఇక కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

రెండవది, కేవైసీ అప్‌డేట్‌ గురించి బ్యాంకులు ఇకపైన కస్టమర్లకు కనీసం మూడుసార్లు సమాచారం అందచేయాల్సి ఉంటుంది. కాగా, ఒకసారి మాత్రం తప్పనిసరిగా లేఖ రూపంలో సమాచారం పంపడం తప్పనిసరి. కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల వారికి ఈ మార్పు గొప్ప ఉపశమనం. 

ఇలా ఉండగా, ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ), ఎలక్ట్రానిక్‌ నగదు బదిలీ(ఈబీటీ), స్కాలర్‌షిప్పులు, ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన వంటి పథకాల కోసం బ్యాంకు ఖాతాలు తెరచిన ఖాతాదారులు పెద్ద సంఖ్య లో కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకపోవడంతో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.