శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా

శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా
ప్రతికూల వాతావరణం కారణంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసి యాత్ర జూన్ 11(బుధవారం)కు వాయిదా పడింది. మంగళవారం సాయంత్రం 5 గంటల 52 నిమిషాలకు జరగాల్సిన స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం బుధవారానికి వాయిదా పడినట్టు ఎక్స్ మాధ్యమంలో ఇస్రో తెలిపింది. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రయోగం జరగనుందని ఎక్స్‌ మాధ్యమంలో ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్‌ వెల్లడించారు

మంగళవారం నిర్వహించాల్సిన ప్రయోగం ఒకవేళ వాయిదా పడితే, ఈ నెల 11న సాయంత్రం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మరో అవకాశం ఉన్నట్లు స్పేస్‌ఎక్స్‌ ఇప్పటికే ప్రకటించింది. దీంతో బుధవారం ఈ ప్రయోగం చేపట్టనున్నారు. యాక్సియం-4 పేరుతో చేపట్టిన ఈ యాత్రలో శుభాంశు మిషన్‌ పైలట్‌గా వ్యవహరిస్తారు. 

28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాన్షు శుక్లా సహా మరో మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు టిబర్‌ కపు (హంగరీ), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ- విస్నియెస్కీ (పోలండ్‌)లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు పయనం కానున్నారు. ఈ మిషన్ 14 రోజుల పాటు కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆక్సియమ్ 4 మిషన్‌లో భారత్‌, పోలాండ్‌, హంగేరీకి చెందిన వ్యోమగాములు ఉన్నారు. ఈ మిషన్‌ను నాసా, ఇస్రో సంయుక్తంగా చేపడుతున్నాయి.

1984లో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా రోదసి యానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత భారత పౌరుడొకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. వాస్తవానికి యాక్సియం-4 మిషన్‌ కోసం వీరు గత నెల 29నే నింగిలోకి పయనం కావాల్సింది. అయితే, దాన్ని తొలుత ఈ నెల 8కి, అనంతరం 10కి మార్చారు. తాజాగా మరోసారి వాయిదా పడింది. శుక్లా అనుభవాలను భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది.